అలుపెరుగని పోరు | united andhra movement still going on | Sakshi
Sakshi News home page

అలుపెరుగని పోరు

Sep 16 2013 2:37 AM | Updated on Sep 1 2017 10:45 PM

సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. ఆదివారంతో సమైక్య ఉద్యమం 47వ రోజుకు చేరుకోగా, సర్వజనుల సమ్మె 34వ రోజుకు చేరుకుంది.


 సాక్షి, కాకినాడ :
 సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. ఆదివారంతో సమైక్య ఉద్యమం 47వ రోజుకు చేరుకోగా, సర్వజనుల సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అయినా పట్టు విడవకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
 
 ఆదివారం జిల్లాలో పలుచోట్ల క్రైస్తవులు సమైక్యాంధ్ర పరిరక్షణను కాంక్షిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అమలాపురంలో కార్ల్‌డేవిడ్ కొమానపల్లి ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు సమైక్యాంధ్ర కోసం అమలాపురం బాలయోగి స్టేడియం సమీపంలోని మన్నా జూబ్లీ చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి నుంచి నల్లవంతెన వరకు ర్యాలీగా తరలి వచ్చి వంతెనపై బైఠాయించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంలోని కాంగ్రెస్ పాలకుల మనసు మార్చాలని ఏసుప్రభువును వేడుకుంటూ గంటన్నరపాటు ప్రార్థనలు చేశారు. క్రైస్తవ చిన్నారులు రోడ్డుపైనే కోలాటాలు, నృత్యాలు చేస్తూ, క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ నిరసన తెలిపారు. కొమానపల్లి మాట్లాడుతూ రాష్ర్టవిభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం సోనియాకు ఎక్కడిదని ప్రశ్నించారు.
 
  47 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్య ఉద్యమాలు జరుగుతున్నా సోనియా చెవికెక్కకపోవడం బాధాకరమన్నారు. పిఠాపురం సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో 300 మందికి పైగా క్రైస్తవులు 216 జాతీయ రహదారిపై చర్చి సెంటర్‌లో బైఠాయించిప్రార్థనలు చేశారు. పెద్దాపురం, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయాల వద్ద జేఏసీ శిబిరాల ఎదుట క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పిఠాపురం మున్సిపల్ కల్యాణమండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన  జరుగుతున్న జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. నాయకుల కార్లకు గాలి తీసేసి, బ్యానర్లు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదులను శాంతింపచేశారు. బీజేపీ నేతలు చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి వెనుదిరిగారు.
 
 మంత్రులకు మంచిబుద్ధినివ్వు వినాయకా!
 భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో  మండపేట కలువపువ్వు సెంటర్‌లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణతో పాటు ఇతర పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వివిధ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు మండపేటలో ర్యాలీ నిర్వహించి కేంద్ర మంత్రులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ వినాయకునికి వినతి పత్రం సమర్పించారు.రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టర్ కిషోర్‌కుమార్‌గౌడ్ గుండు గీయించుకొని విభజన నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. విజయవంతమైన ‘అపరిచితుడు’ సినిమాలోని పాత్ర బొమ్మతో ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి నాగదేవి థియేటర్‌కు రానున్నాడని, సమైక్య ఉద్యమకారులంతా తరలి రావాలని నగరంలో వెలసిన పోస్టర్లు ఆసక్తిని రేపాయి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట జేఏసీ శిబిరంలో ఆయుష్, లునానీ, ఆయుర్వేద వైద్యులు, సిబ్బంది దీక్షలు చేపట్టారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ  ప్రాంతానికి చెందిన ఉద్యోగి పాపయ్యను సన్మానించారు. లునానీ వైద్యుడు శ్రీనివాస్ ఆసనాలు వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ శిబిరం వద్ద విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో నిరసన తెలిపారు. ఈ శిబిరాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.
 
 బస్సుల్ని శుభ్రం చేసిన ఆర్టీసీ కార్మికులు
 కాకినాడలో ఆర్టీసీ కార్మికులు డిపో గ్యారేజ్‌లోని బస్సులను శుభ్రం చేసి  నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సెంటర్‌లో గ్రామస్తులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ముమ్మిడివరంలో ఫీల్డు అసిస్టెంట్లు చేపట్టిన 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. తహశీల్దార్ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై సమైక్యవాదం అనే నినాదంతో కోనసీమ కవులు నిర్వహించిన కవిసమ్మేళనం ఆకట్టుకుంది. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గొడుగులతో నిరసన ప్రదర్శన చేశారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద రైతులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. విద్యార్థులు మానవహారం నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం తెలిపారు. మామిడికుదురు మండలం కొమరాడ సెంటర్‌లో మోకాళ్లపై నిల్చొని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. రాజోలు యూత్ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై కోడిపందాలు నిర్వహించారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ శిబిరం వద్ద క్రైస్తవులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జేఏసీ నాయకులు సామర్లకోటలో మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.
 
 ఏలేశ్వరంలో లారీలతో హారం
 
 ఏలేశ్వరం బాలాజీచౌక్‌లో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో 50కి పైగా లారీలతో ప్రదర్శన నిర్వహించారు. సెంటర్ చుట్టూ లారీలతో హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో బాలాజీచౌక్ ప్రధాన రహదారిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ధర్నా నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. జగ్గంపేట సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవ హారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. రామచంద్రపురం మెయిన్‌రోడ్డులో విద్యార్థులు తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు తదితర వేషధారణలతో ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామలో రజకుల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి నిరసన తెలిపారు. మామిడికుదురులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, మండల  కన్వీనర్ బొలిశెట్టి భగవాన్, పలువురు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.  కాగా 72 గంటల సమ్మె ముగియడంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది విధుల్లో చేరారు. విభజనపై నోట్ ప్రవేశపెట్టే పరిస్థితి ఏర్పడితే తామంతా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement