గ్రామ కార్యదర్శులకు బదిలీ | To the transfer secretaries of the village | Sakshi
Sakshi News home page

గ్రామ కార్యదర్శులకు బదిలీ

Nov 9 2014 1:09 AM | Updated on Sep 2 2017 4:06 PM

గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ నూతన నిబంధనలను రూపొందిం చింది.

కొత్త నిబంధనలు రూపొందించిన ఏపీ పంచాయతీరాజ్
 
హైదరాబాద్: గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ నూతన నిబంధనలను రూపొందిం చింది. ప్రస్తుతం తాను పుట్టిన ఊరులోనో లేదంటే సొంత మండలంలోనే గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారిప్పుడు ఈ నిబంధనల మేరకు బదిలీ కాక తప్పదు. వాటిపై సంబంధిత శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తాను జన్మించిన రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న ఎంపీడీవోలను వేరొక రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని నిబంధన విధించారు. ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నప్పటికీ 11 నాటికే ఈ ప్రక్రియ ముగించాలని అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల విభాగాల్లోని జిల్లా ఎస్‌ఈలు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారుల బదిలీల ఫైలుకు మంత్రి శనివారం ఆమోదం తెలిపారు.

డిసెంబరు నాటికి .. ఎన్టీఆర్ సుజల

ఎన్టీఆర్ సుజల పథకంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటి వరకు 245 నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పన ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొన్నామని డిసెంబర్ ఆఖరు నాటికి ప్రతి మండలంలోనూ కనీసం ఒక ప్లాంటునైనా ఏర్పాటు చేస్తామన్నారు. కార్తీక వనమహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ నెల 17న విశాఖ రానున్నారని.. ఈ సందర్భంగా తుపాను సమయంలో బాగా పనిచేసిన అధికారులకు అభినందన కార్యక్రమం ఉంటుందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement