జిల్లావ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి చలి బాగా పెరిగింది. దట్టంగా కమ్మేస్తున్న మంచుదుప్పటి భానుడి కిరణాలు సైతం నేలకు సోకకుండా అడ్డుకుంటోంది.
=జిల్లావాసుల గజగజ
=తుపాను ప్రభావంతో పెరిగిన గాలులు
=పడిపోతున్న పగటిపూట ఉష్ణోగ్రతలు
=నందిగామలో 13 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, మచిలీపట్నం : జిల్లావ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి చలి బాగా పెరిగింది. దట్టంగా కమ్మేస్తున్న మంచుదుప్పటి భానుడి కిరణాలు సైతం నేలకు సోకకుండా అడ్డుకుంటోంది. దీనికితోడు మాదీ తుపాను ప్రభావంతో చలిగాలులు మరింత పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా చలి తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నం దిగామ ప్రాంతంలో ఆదివారం రాత్రి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
గత ఏడాది ఇదే ప్రాంతంలో 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 22 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత కాగా, 29 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 13 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రతగాను, 29 డిగ్రీలు అత్యధికంగాను నమోదైంది. పగటి ఉష్ణ్రోగ్రతలు కూడా రెండు రోజులుగా 27 డిగ్రీలకు పడిపోయాయి. ఎండలు కాస్తున్నప్పటికీ చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలు చలిగాలుల నుంచి రక్షణ పొందేందుకు నానా పాట్లు పడుతున్నారు.
సాయంత్రమైతే చాలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. వెచ్చదనాన్ని ఇచ్చే రగ్గులను ఉపయోగిస్తున్నారు. పేద, మద్యతరగతి ప్రజలు సైతం రాత్రి సమయాల్లో చలికి తట్టుకోలేక ఇళ్ల ముందు చలిమంటలు వేసుకుని కొంతమేర ఉపశమనం పొందుతున్నారు. ఇక రాత్రి సమయాల్లో వాహనచోదకుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సాయంత్రం 6 గంటల తరువాత వాహనాలు నడిపేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత పెరిగితే ఆస్తమా రోగులకు మరింత ఇబ్బందేనని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్వెట్టర్లు, మంకీక్యాప్లు వంటి వేడినిచ్చే దుస్తులతో పాటు కోల్డ్క్రీమ్ల వినియోగం పెరిగింది.


