నందిగాంలోని ఓ దాబా సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నందిగాం: నందిగాంలోని ఓ దాబా సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. టెక్కలి నుంచి పలాస వైపు మోటారు ఇంజన్ల సామాన్లు తీసుకువెళ్తున్న లారీ రోడ్డుకు పక్కగా నిలిపి లోపల ఒకరు, పైన మరొకరు నిద్రిస్తున్నారు. అదే దారిలో చెన్నై నుంచి కోల్కతాకు ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న మరో లారీ అధిక వేగంతో వెనుక నుంచి ఢీకొంది.
ఈ ఘటనలో లారీలో నిద్రిస్తున్న రాజ్కుమార్(23) కాలికు తీవ్రగాయాలు కాగా పైన నిద్రిస్తున్న ఎం.కృష్ణమూర్తి(49) లారీ లోడు కింద చిక్కుకున్నాడు. ఢీకొట్టిన లారీ డ్రైవర్ అరం మురుగన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను టెక్కలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నందిగాం ఇన్చార్జి ఎస్ఐ ఎం.ఎస్.వి.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.