తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో ‘సోనియా అభినందన’ సభ నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో ‘సోనియా అభినందన’ సభ నిర్వహించారు. సొంత నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్రెడ్డి దూరంగా ఉన్నారు. సీఎం కిరణ్ కుమార్రెడ్డితో సాన్నిహిత్యం, సమైక్యవాదం వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.
అయితే జయప్రకాశ్రెడ్డి అనుచరులు మాత్రం సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల సందర్భంగా పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటుతో హడావిడి చేసే విప్ మాత్రం ఈ సారి ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. మరోవైపు సమావేశం ఆద్యంతం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కేంద్రంగా సాగింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ఎదుట డిప్యూటీ సీఎం సమర్థవంతంగా వాదనలు వినిపించారంటూ పార్టీ నేతలు పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి గీతారెడ్డి గైర్హాజరవుతారనే ప్రచారం జరగ్గా, ఆలస్యంగా సమావేశ ప్రాంగణానికి వచ్చారు. ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి, సీహెచ్ ముత్యంరెడ్డి సమావేశ ప్రాంగణానికి వచ్చి సభ ప్రారంభానికి ముందే వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తుండటంతో మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎం, ఇతర నేతలను కలిసి వెళ్లారని పార్టీ నేతలు వివరణ ఇచ్చారు.