టెన్త్ విద్యార్థులకు సప్తగిరి చానల్లో బోధన
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా పాఠాలు బోధించనున్నామని తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సప్తగిరి చానల్లో టెన్త్ పాఠ్యాంశాల బోధన ప్రసారం అవుతాయి.
► పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి. ఆయా సబ్జెక్టులను ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేలా ప్రసారాలను రూపొందించాం.
► రాష్ట్రంలో దాదాపు 5లక్షల మంది విద్యార్థులు వీటిని వీక్షిస్తున్నారు. అవే బోధనాంశాలను యూట్యూబ్లో సప్తగిరి చానల్ అందుబాటులో ఉంచుతోంది.
► ఆన్లైన్ పాఠాలు బోధించడానికి ఉత్సాహం గల ఉపాధ్యాయులు కూడా ముందుకు రావచ్చు.
► 1 లేదా 2 నిమిషాల నిడివితో వీడియోలను తయారుచేసి పంపిస్తే పరిశీలించి వారిని సైతం ఆన్లైన్ క్లాస్ వర్క్లో ఉపయోగించుకుంటాం.
► లాక్ డౌన్ కాలంలో ఉన్నత విద్యకు సంబంధించి తరగతులు నిర్వహించేలా అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చాం.