టీడీపీ కార్యాలయం ముట్టడి | TDP office of the siege | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయం ముట్టడి

Feb 20 2016 2:54 AM | Updated on Aug 29 2018 3:37 PM

టీడీపీ కార్యాలయం ముట్టడి - Sakshi

టీడీపీ కార్యాలయం ముట్టడి

కర్నూలు శివారుల్లోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే కాలనీ వాసులు టీడీపీ జిల్లా కార్యాలయాన్

జ్యోతిరావు పూలే
కాలనీవాసుల నిరసన
నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
ఇళ్లపట్టాలు రద్దు చేస్తానన్న కలెక్టర్‌ను బదిలీ చేయాలని నినాదాలు

  
కర్నూలు :కర్నూలు శివారుల్లోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే కాలనీ వాసులు టీడీపీ జిల్లా కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించి దిగ్భందం చేశారు. ఆరు నెలల క్రితం కాలనీలో నివాసం ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన తర్వాత కాలనీవాసులంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం తనయుడు నారా లోకేష్‌ను కలిసారు. జ్యోతిరావు పూలే కాలనీలో ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. అయితే లోకేష్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఇంటి పట్టాలను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ప్రయత్నిస్తున్నారని ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ తెలుగు మహిళా మాజీ రాష్ట్ర కార్యదర్శి పట్నం రాజేశ్వరి నాయకత్వంలో శుక్రవారం ఉదయం కార్యాలయాన్ని ముట్టడించి రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న జ్యోతిరావు పూలే కాలనీవాసుల ఇంటి పట్టాలు రద్దు చేస్తానన్న కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయాలన్నారు.

గతంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లా కలెక్టర్ నిరుద్యోగులతో చెలగాటమాడారని, అలాగే జర్నలిస్టుల బస్సు పాస్‌ల విషయంలోనూ వివక్షత ప్రదర్శించారని ఆరోపించారు. గుడిసెలు కాలిపోయి రోడ్డున పడిన జ్యోతిరావు పూలేకాలనీ వాసులు పోరాడి పట్టాలు సాధించుకుంటే వాటిని రద్దు చేస్తానని కలెక్టర్ బెదిరించడం అన్యాయమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. కాలనీలో ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు గంటల అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల పుల్లారెడ్డి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకారులతో వినతిపత్రం స్వీకరించారు. పార్టీ పెద్దలతో మాట్లాడి జ్యోతిరావు పూలే కాలనీవాసులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ మహిళలు వెంకట శేషమ్మ, చిట్టెమ్మ, మల్లమ్మ, నాగేంద్రమ్మ, ఆదిలక్ష్మి, స్వామక్క, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement