అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులు ఘర్షణకు దిగారు.
గోరంట్ల: అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులు ఘర్షణకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పెనుగొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ముఖ్య అనుచరుడు నరేష్ ఈ నెల 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ప్రమాదం వెనుక హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప సోదరుడి కుమారుడు నిమ్మల యువశేఖర్ హస్తం ఉందని, ప్రమాదం ముసుగులో హత్య చేశారని నరేష్ బంధువులు ఆరోపించారు. మృతుని బంధువులు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గోరంట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ నిరసనకు దిగారు. ఈ విషయం తెలిసిన ఎంపీ కిష్టప్ప, ఆయన అనుచరులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్నవారిపై దాడికి ప్రయత్నించారు.