రాక్షస పాలనను ప్రతిఘటించాలి | TDP government, the police put a row of giant reign | Sakshi
Sakshi News home page

రాక్షస పాలనను ప్రతిఘటించాలి

Nov 1 2014 12:22 AM | Updated on May 25 2018 9:17 PM

రాక్షస పాలనను ప్రతిఘటించాలి - Sakshi

రాక్షస పాలనను ప్రతిఘటించాలి

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్

రామచంద్రపురం :రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గాంధీపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్ అద్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో బోస్ మాట్లాడారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేతికందగానే వాటిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయకుండా, పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నామనడం సిగ్గుచేటని విమర్శించారు.
 
 పెన్షన్ల సెలక్షన్ కమిటీల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు కాకుండా టీడీపీ కార్యకర్తలను సభ్యులుగా వేశారన్నారు. వారి ఇష్టానుసారం పెన్షనర్లను ఎంపిక చేసి అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. దీనిపై కోర్టును ఆశ్రయించైనా సరే అర్హులందరికీ న్యాయం చేసేలా పోరాడతామని బోస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మోసపూరిత కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త పైనా ఉందన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఎగవేతకు ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను బయటపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఐదో తేదీన ప్రతి మండలంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయాలని  పిలుపునిచ్చారు. పార్టీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement