తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నేడు చూసిన ర్యాలీని గతంలో ఎన్నడూ చూడలేదని..........
చిలకలూరిపేట: తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నేడు చూసిన ర్యాలీని గతంలో ఎన్నడూ చూడలేదని 5వేల బైకులతో యువత ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనపడటం గొప్ప విషయమని పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహావిష్కరణకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సభకు పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ దొడ్డా బాలకోటిరెడ్డి మంచి రాజకీయ వ్యక్తి అని కొనియాడారు. చంద్రబాబు సర్పంచ్గా కూడా హోదాలేని లోకేష్ను జాతీయ రాజకీయాల్లో తిప్పడానికి ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే ఒక్క సీటు రావడం ఆ పార్టీ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడుతున్నారన్నారు.
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ దొడ్డా బాలకోటిరెడ్డి ఎన్నో పదవులను నిర్వహించి పల్నాటి బిడ్డగా పౌరుషాన్ని చూపించారని పేర్కొన్నారు. పల్నాడులో కోడెలకు బాల కోటిరె డ్డి గట్టిపోటీ ఇచ్చారని, నరసరావుపేట రాజకీయాల్లో దొడ్డా కీలక పాత్ర పోషించారన్నారు. జగన్కు ఈ ప్రాంతంలో ఇంతటి స్పందన రావడం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోందని తెలిపారు. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో అమ్మగారు, కొడుకు, కూతురు దోచుకుంటున్నారని తెలిపారు. ఎకరం ల్యాండ్ కన్వర్షన్కు రూ.5లక్షలు ఇక్కడ మేడమ్కు కప్పం కట్టాలని తెలిపారు.
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ ఎన్నికలు వస్తే వైఎస్సార్సీపీ కార్యకర్తల ఓట్లతో బాక్సులు నిండాలని ఆకాంక్షించారు. బాబు పాలనకు స్వస్తి పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముందుగా పిల్లి ఓబుల్ రెడ్డి తన ప్రసంగంతో కార్యకర్తలను ఆకట్టుకున్నారు. వేదికపై పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, గజ్జల రామకృష్ణారెడ్డి, ఉడతా వెంకటేశ్వరరావు, సింగారెడ్డి కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. సభకు ముందు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ను పార్టీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జగన్ దివంగత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు