అన్నింటికీ నేనున్నా..

అన్నింటికీ నేనున్నా..


అంతా చూసుకుంటానని చంద్రబాబు అభయమిచ్చారు: స్టీఫెన్‌సన్

తమ వాళ్లు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు

మే 30న సాయంత్రం 4 గంటల సమయంలో బాబు నాతో మాట్లాడారు

మత్తయ్య ద్వారా డీల్ మొదలైంది.. తర్వాత సెబాస్టియన్, రేవంత్ వచ్చారు

తొలుత రూ. 2.5 కోట్లు ఇస్తామన్నారు.. ఓటేయకుండా విదేశాలకు వెళ్లాలన్నారు

నేను స్పందించకపోవడంతో.. ఎంత కావాలో చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు

దీనిపై చంద్రబాబుతో సెబాస్టియన్ మాట్లాడించారు

‘ఓటుకు కోట్లు’ వ్యవహారాన్ని వాంగ్మూలంలో పూసగుచ్చిన స్టీఫెన్‌సన్


 

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ధ్రువీకరిం చారు. ‘నీకు రూ.5కోట్లు ఇస్తాం.. నీ బాగోగులు చూసుకుంటా..’ అని బాబు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఆ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు మాటలను స్టీఫెన్‌సన్ యథాతథంగా తన వాంగ్మూలంలో ప్రస్తావించారు. మాథ్యూస్ జెరూసలేం (మత్తయ్య) ద్వారా ఈ డీల్ మొదలైందని, చంద్రబాబు పంపాడంటూ హ్యారీ సెబాస్టియన్ నేరుగా తన ఇంటికి వచ్చి బేరసారాలు చేశారని స్టీఫెన్‌సన్ వెల్లడించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండి ఓటు వేయకుంటే రూ. 2 కోట్లు ఇస్తామని, కుటుంబంతో సహా విదేశాలకు  వెళ్లేందుకు టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అదే టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేస్తే రూ.5కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం ఇచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్‌సన్ ఈ వివరాలను వెల్లడించారు. బేరసారాలు మొదలైనప్పటి నుంచి రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడేవరకు వరుసగా జరిగిన సంఘటనలను వివరించారు. మే 30న సాయంత్రం 4 గంటల సమయంలో బాబు తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు స్టీఫెన్‌సన్ ఈ వాంగ్మూలంలో చెప్పారు.

 

 స్టీఫెన్‌సన్ వాంగ్మూలం..

 ‘‘మే 28న ఉదయం 10 గంటల ప్రాంతంలో మత్తయ్య బోయిగూడలోని మా నివాసానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తనను సంప్రదించాలని చెప్పారని అన్నారు. రూ.2కోట్లు ఇస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఎక్కడికైనా వెళ్లాలని మత్తయ్య నన్ను కోరారు. వేరే దేశానికి వెళ్లేందుకు విమానం టికెట్‌ను కూడా తామే ఏర్పాటు చేస్తామని చెప్పారు. నా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. గంటన్నర తర్వాత ఆంథోనీ అనే వ్యక్తి హారీ సెబాస్టియన్‌తో కలిసి మా ఇంటికి వచ్చారు. సెబాస్టియన్ తనను తాను పరిచయం చేసుకున్నారు. పాస్టర్‌గా పనిచేస్తున్నానని. చంద్రబాబునాయుడు తనను పంపారని, మీ సహకారం కావాలని కోరాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండేందుకు అంగీకరిస్తే రూ.2కోట్లు ఇవ్వడంతోపాటు జెరూసలేం వెళ్లేందుకు కుటుంబం మొత్తానికి విమానం టికెట్లు సమకూరుస్తామన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5కోట్లు ఇస్తామని చెప్పారు. వీరి ప్రతిపాదనపై ఆలోచించి చెబుతానని చెప్పాను. లంచం తీసుకుని ఓటు వేయడం చట్టవ్యతిరేకమే కాకుండా అనైతికమని భావించాను.

 

 ఏసీబీకి ఫిర్యాదు చేశా..

  నన్ను ప్రలోభ పెట్టిన వ్యవహారంపై గత నెల 28న ఏసీబీ డెరైక్టర్ జనరల్‌కు లేఖ రాశాను. దాన్ని పరిశీలించిన డీజీ.. తన ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌ను ఆదేశించారు. అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో మత్తయ్య మరోసారి నాకు ఎస్‌ఎంఎస్ పంపారు. తాజ్‌కృష్ణా హోటల్‌లో కలిసేందుకు ఏ సమయమైతే వీలవుతుందో చెప్పాలని కోరారు. 29న మరోసారి ఎస్‌ఎంఎస్ చేశారు. 29న రాత్రి 9 గంటలకు సెబాస్టియన్ మరోసారి ఫోన్ చేశారు. టీడీపీకి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తులతోనే మాట్లాడిస్తామని చెప్పారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో జరుగుతోందని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే డీఎస్పీ అశోక్‌కుమార్‌కు నేను తెలియజేశాను. 30వ తేదీన ఉదయం 10 గంటలకు రేవంత్‌రెడ్డితో కలిసి తాను వస్తానని సెబాస్టియన్ తెలియజేశారు. 30వ తేదీ ఉదయం 10 గంటలకు సెబాస్టియన్ నుంచి ఫోన్ వచ్చింది. రేవంత్‌రెడ్డితో కలిసి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో డీఎస్పీ తన సిబ్బందితో కలసి వీడియో, ఆడియోను రికార్డు చేసే ఒక ఐఫోన్‌ను సిట్టింగ్ హాల్‌లో టీవీకి దగ్గరగా ఏర్పాటు చేశారు.

 

 తీవ్రంగా ఒత్తిడి చేశారు..

 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ మా ఇంటికి వచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓట్లను సమకూర్చే బాధ్యతను చంద్రబాబు తనకు అప్పజెప్పారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ డీల్ విషయం బయటపడితే రూ.2.5కోట్లు ఇవ్వడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్రిస్టియన్ మైనారిటీ విభాగానికి సంబంధించిన నామినేటెడ్ పదవిని ఇస్తామని చెప్పాడు. చంద్రబాబుతో రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని రేవంత్‌రెడ్డి నాతో చెప్పారు. అయితే నేను చంద్రబాబును కలిసేందుకు అంగీకరించలేదు. రేవంత్‌తో డీల్ జరుపుతానని చెప్పాను. రేవంత్‌ను కూల్‌డ్రింక్, లేదా టీ తాగాలని కోరగా.. మంచినీరు ఇవ్వాలని కోరారు. నా కుమార్తె జెస్సికా స్టీఫెన్‌సన్ అలియాస్ కుక్కీ రేవంత్‌రెడ్డికి మంచినీరు ఇచ్చింది. ఒకవేళ రెండున్నర కోట్లు సరిపోవని అనుకుంటే ఎంత కావాలో చెప్పాలని, ఆ విషయాన్ని చంద్రబాబుకు తెలియజేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎన్ని కోట్లు ఇవ్వాలనేది చంద్రబాబు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రూ.2.5కోట్లు సరిపోకపోతే నిర్దిష్టంగా ఎంత మొత్తం కావాలో స్పష్టం చేయాలని పదేపదే రేవంత్‌రెడ్డి నన్ను అడిగారు. దాంతో రూ.5కోట్లు ఇవ్వాలని.. నాకు తోచిన మొత్తాన్ని ఆయన సూచన మేరకు చెప్పాను. దీంతో వారిద్దరూ లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజే చంద్రబాబు తనతో మాట్లాడుతారని, డీల్‌ను ఖరారు చేస్తారని రేవంత్ చెప్పారు.

 

 కలసి పనిచేద్దాం..

 అదే రోజు సాయంత్రం సెబాస్టియన్ మూడు నుంచి నాలుగు సార్లు చంద్రబాబు ఇతర సమావేశాల్లో బిజీగా ఉన్నారని, సమయం దొరికినప్పుడు ఆయనతో మాట్లాడిస్తానని చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతారని నాకు చెప్పి ఆయనకు ఫోన్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు ఫోన్‌లో మాట్లాడడం ప్రారంభిస్తూ.. ‘మావాళ్లు డీల్ గురించి బ్రీఫ్ చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీకు అండగా నేనుంటాను. మావాళ్లు నీకు ఎంత ఇస్తామన్నారో దాన్ని నెరవేరుస్తాను. ఓటు వేసే విషయంలో నిర్భయంగా నిర్ణయం తీసుకోండి. మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కలిసి పనిచేద్దాం’ అంటూ రూ.5కోట్లు ఇస్తామన్న హామీపై భరోసా ఇచ్చారు. అంతా తాను చూసుకుంటానని అభయమిచ్చారు. 30వ తేదీ రాత్రి 9 గంటలకు సెబాస్టియన్ కొత్త మొబైల్ నుంచి నాకు ఎస్‌ఎంఎస్ చేశారు.

 

చివరి నిమిషంలో ప్లేస్ మార్చమన్నారు


 31వ తేదీ ఉదయం 8.50కి సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. ఓటు కోసం కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా అడ్వాన్స్ రూ.50 లక్షలు తీసుకొని రేవంత్‌రెడ్డి, తాను 2 గంటల సమయంలో మా ఇంటికి వస్తానని చెప్పారు. మధ్యాహ్నం 3.20కి ఫోన్ చేసి నా ఇంటికి రావడం ఇష్టం లేదని, డబ్బు తీసుకునే స్థలాన్ని మార్చాలని కోరారు. దీంతో నా మిత్రుడు మాల్కం టేలర్‌కు చెందిన తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల ఎదురుగా ఉండే అపార్టుమెంట్‌కు రమ్మని సూచించాను. కొంత మంది ముఖ్యమైన వ్యక్తులతో మీ ఇంట్లో కలుస్తానని టేలర్‌కు చెప్పాను. అయితే తన తల్లి ఇంట్లో లేనందున ఆమె ఇంట్లో కలుద్దామని టేలర్ సూచించారు.



ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు తెలియజేశాను. ఆ తర్వాత మాల్కం టేలర్ తల్లి ఇంటికి వెళ్లాను. నేను, నా మిత్రుడు మాల్కం టేలర్ హాల్‌లో కూర్చున్నాం. ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ పరికరాలను హాల్‌లో అమర్చారు. నాకు ఐఫోన్ వీడియో రికార్డర్ ఇచ్చి చేతిలో పట్టుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. ఉప్పల్ వైపు నుంచి తాను రేవంత్‌రెడ్డి వస్తున్నామని, అడ్రస్ చెప్పాలని కోరారు. మాల్కం టేలర్ వారికి అడ్రస్ వివరించారు. 4.20 ప్రాంతంలో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చి హాల్‌లో కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత తెల్లచొక్కా, జీన్స్ ప్యాంట్ వేసుకుని, 5.8 అడుగుల పొడవున్న లావుపాటి వ్యక్తి అక్కడికి వచ్చి నల్లటి బ్యాగును రేవంత్‌రెడ్డి పక్కన పెట్టారు. రేవంత్‌రెడ్డి బ్యాగును ఎత్తి సదరు వ్యక్తికి ఇచ్చి.. డబ్బు తీసి టీపాయ్ మీద పెట్టాలని చెప్పారు. ఒక్కోటి 5 కట్టలున్న 500 రూపాయల 20 బండిళ్లను.. రూ.50 లక్షల మొత్తాన్ని రేవంత్‌రెడ్డి, అతను నా ముందుంచారు.

 

 రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..

 రేవంత్‌రెడ్డి, ఆ వచ్చిన వ్యక్తి ఇద్దరూ లేచి నిలబడి తమకు అత్యవసర పని ఉన్నందున వెళ్తామని అన్నారు. ఇంకా కూర్చొని ఉన్న సెబాస్టియన్ చర్చలు కొనసాగించేందుకు అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని, డబ్బు తెచ్చిన వ్యక్తిని ఫ్లాట్ లోపలికి తెచ్చారు. నేను టేలర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాను. ఆ ఇంటికి సమీపంలోనే ఉన్నాను. ఈ మొత్తం వ్యవహారం జరిగిన మూడు గంటల తర్వాత డీఎస్పీ అశోక్‌కుమార్ నన్ను పిలిపించి రేవంత్‌రెడ్డిని నా ఎదురుగా ఉంచి డబ్బు గురించి విచారించారు. ఈ సమయంలో రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, మరో వ్యక్తి ఉన్న విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. వారు తెచ్చిన రూ.50 లక్షల డబ్బు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఇవ్వజూపిన లంచం మొత్తమని ఏసీబీ డీఎస్పీకి చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను డీఎస్పీ రికార్డు చేశారు. నన్ను, నా మిత్రుడు మాల్కం టేలర్, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు డబ్బు తెచ్చిన మరో వ్యక్తిని డబ్బుతో సహా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఏసీబీ అధికారులు నన్ను విచారించి నా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా ఆడియో, వీడియో ద్వారా ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. నేను చెబుతున్న విషయాలన్నీ వాస్తవాలు. స్వచ్ఛందంగా నేను ఈ వాంగ్మూలం ఇస్తున్నాను..’’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top