వెలగపూడిలోని ఏపీ అసెంబ్లీ భవనంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఏపీ అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది : కోడెల
Aug 15 2017 10:28 AM | Updated on Jul 29 2019 2:44 PM
అమరావతి: వెలగపూడిలోని ఏపీ అసెంబ్లీ భవనంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని.. అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ట్రాన్సిట్ భవనాలను నిర్మించుకుని సొంత రాజధాని నుండే పాలన సాగిస్తున్నామని, శాశ్వత భవనాల నిర్మాణాలను కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పారు.
శాసనమండలి భవనంపై మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. వారి స్ఫూర్తితో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో జాతీయ జెండాను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి ఎగురవేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప్రత్యేక అధికారి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల వందనాన్ని స్వీకరించారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనూ సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Advertisement
Advertisement