దొంగ ఏడ్పులెందుకో సోమిరెడ్డి చెప్పాలి

Somireddy Do Not Give Development To Sarvepalli - Sakshi

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు: రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రచారాల్లో దొంగ ఏడ్పులు ఎందుకో సోమిరెడ్డి సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం మండలంలోని వరకవిపూడి పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి  కాకాణికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కాకాణి మాట్లాడుతూ సర్వేపల్లిలో వరుసగా మూడుసార్లు వరుస ఓటమిలతో హాట్రిక్‌ కొట్టిన సోమిరెడ్డి అడ్డదారిలో మంత్రి పదవి పొంది రూ.వందల కోట్లను అక్రమంగా సంపాదించారన్నారు.

సర్వేపల్లిలో తానేమి అభివృద్ధి చేశాడో చెప్పకుండా ప్రచారాల్లో దొంగ ఏడ్పులు ఏడుస్తూ గెలిపించి పరువు నిలపాలంటూ ఓటర్లను ప్రాథేయపడడం సోమిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసి అభివృద్ధిని విస్మరించిన సోమిరెడ్డిని నాల్గో దఫా కూడా సాగనంపడానికి సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే ఐదేళ్లుగా అవినీతి అరాచకాలతో ప్రజలకు చుక్కలు చూపించిన టీడీపీ ప్రభుత్వానికి అవే చుక్కలు చూపించి ఓడించాలన్నారు.

రానున్న ఎన్నికల్లో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరించి సీఎంగా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్, స్థానిక పార్టీ నాయకులు కూరపాక కృష్ణారెడ్డి, చిల్లకూరు శ్రీనివాసులురెడ్డి, కాపులూరు మహేష్‌రెడ్డి, సుమన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ధ్రువకుమార్‌రెడ్డి, ఉప్పల అమరేంద్ర, నిడుగుంట మల్లి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top