
బావ అసభ్యంగా ప్రవర్తించాడని మరదలి ఆత్మహత్య
బావ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మరదలు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మురమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఐ.పోలవరం :బావ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మరదలు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మురమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన కాశి జ్యోతి (25) రాఘవేంద్ర వారధిపై నుంచి గోదావరిలోకి దూకింది. ఆ సమయంలో వారధిపై వెళుతున్న ప్రయాణికులు ఆమెను గమనించి స్థానికులకు తెలియజేశారు. స్థానికులు హుటాహుటిన గోదావరిలో వెతకడం మొదలు పెట్టారు. అయినా లాభం లేకపోయింది. వారధికి అర కిలోమీటరు దూరంలో జ్యోతి శవమై తేలింది. ఐ.పోలవరం పోలీసులు, జ్యోతి భర్త కాశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం...
కాశీకృష్ణ అమలాపురంలో ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం డ్యూటీకి వెళ్లగా అతనికి భార్య జ్యోతి నుంచి సోమవారం సాయంత్రం ఫోన్ వచ్చింది. ముమ్మిడివరంలో ఉంటున్న బావ శ్రీనివాసరావు ఇంటికి వచ్చి అసభ్యంగా తనతో ప్రవర్తించాడని తెలిపింది. కంగారు పడకు ఉదయం ముమ్మిడివరం వెళ్లి తేల్చుకుందామని కాశీకృష్ణ ధైర్యం చెప్పాడు. మంగళవారం ఉదయం ఇద్దరూ ముమ్మిడివరంలోని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. అయితే అతను అక్కడ లేకపోవడంతో ఫోను చేయగా గంటలో వస్తానని చెప్పాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో బయటకు వెళ్లి వస్తానని జ్యోతికి చెప్పి కాశీకృష్ణ వెళ్లాడు.
అక్క ప్రమీల ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేక జ్యోతి తనకు ఫోన్చేసి గాడిలంక వెళ్తున్నానని చెప్పిందని, ఆమె ముమ్మిడివరం నుంచి ఆటో ఎక్కి మురమళ్ల మాణిక్యాంబ ఆలయం వద్ద దిగి వారధిపై నదిలోకి దూకేసిందని కాశీకృష్ణ సంఘటనా స్థలంలో చెబుతూ బోరున విలపిస్తూ చెప్పాడు. జ్యోతి మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాశీకృష్ణ ఫిర్యాదు మేరకు ఐ.పోలవరం హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.