లాఠీ ఝుళిపించిన ఎస్సై

SI Over Action On Students In West Godavari - Sakshi

పరుగులు తీసిన విద్యార్థులు

అనంతరం స్టేషన్‌ వద్ద ధర్నా

పశ్చిమగోదావరి, నరసాపురం : ఆర్టీసీ బస్సు సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం స్థానిక బస్టాండ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై టౌన్‌ పోలీసులు అకస్మాత్తుగా లాఠీలు ఝళిపించడంతో అందరూ విస్తుపోయారు. సమయానికి విద్యార్థులకు బస్సులు అందుబాటులో ఉండటంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే టౌన్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ సిబ్బందితో వచ్చి కొందరు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

విద్యార్థులు పోలీసులతో వాదనకు దిగారు. మేము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటేమమ్మల్ని స్టేషన్‌కు ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. దీంతో టౌన్‌ ఎస్సైతో సహా కొంతమంది పోలీసులు సహనం కోల్పోయి లాఠీచార్జికి దిగారు. ఒక్కసారిగా భీతిల్లిన విద్యార్థులు పరుగులు తీశారు. పోలీసు చర్యలతో తేరుకున్న తరువాత భారీ ర్యాలీతో వెళ్లి పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. దీంతో అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను వదిలిపెట్టడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు ఫిర్యాదు చేశారు. బస్సుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వైవీ ప్రదీప్, పి.తిరుపతిరావు నాయకత్వం వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top