రాహుల్‌గాంధీ బృందంలోకి సీనియర్ ఐఏఎస్ కొప్పులరాజు | Senior IAS koppula raju joins in Rahul gandhi's Group | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీ బృందంలోకి సీనియర్ ఐఏఎస్ కొప్పులరాజు

Aug 8 2013 3:12 AM | Updated on Aug 13 2018 4:01 PM

రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కొప్పులరాజు రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఇంకా మూడేళ్ల సర్వీసును కూడా ఆయన వదులుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కొప్పులరాజు రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఇంకా మూడేళ్ల సర్వీసును కూడా ఆయన వదులుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు పెట్టుకోగా.. రాష్ట్రప్రభుత్వం ఆగమేఘాలపై అనుమతి కూడా ఇస్తోంది.
 
  రాజు స్వచ్ఛంద పదవీ విరమణకు చెందిన ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సంతకం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి పదవీ విరమణ అమల్లోకి వచ్చేలా సీఎం ఆమోదముద్ర వేశారు. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర కేడర్ 1981 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజు ప్రస్తుతం వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
 
  అంతకుముందు రాజు.. సోనియాగాంధీ అధ్యక్షతనగల జాతీయ సలహామండలి సంయుక్త కార్యదర్శిగా ఢిల్లీలో పనిచేశారు. రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో ఆయన పనిచేశారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా, రోశయ్య హయాంలో సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. జాతీయ సలహా మండలిలో పనిచేస్తున్న సమయంలో రాహుల్‌గాంధీకి సన్నిహితంగా రాజు మెలిగేవారు. రాజు పనితీరు నచ్చడంతో రాహుల్‌గాంధీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement
Advertisement