రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటు చేసిన జీఓఎం(కేంద్ర మంత్రుల బృందం)ను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కలవనున్నారు.
హైదరాబాద్:రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటు చేసిన జీఓఎం(కేంద్ర మంత్రుల బృందం)ను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కలవనున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను వివరించేందుకు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా గతంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలనే సీమాంధ్ర ఉద్యోగులకు కూడా వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వీరికి మధ్యంతర భృతిని కూడా అందజేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. ఈ భేటీ అనంతరం జీఎంవో సభ్యులకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన జీఎంవో సభ్యులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను కేటాయించింది. వివిధ శాఖలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులను సీమాంధ్ర ఉద్యోగులు కలిసి విభజన వల్ల సమస్యలను వివరిస్తారు.