ఇళ్లలో రివర్స్‌టెండరింగ్‌ రూ.105.91కోట్లు ఆదా

Reverse Tendering In Homes Saves Rs 105.91Crores - Sakshi

ఏపీ టిడ్కోలో టెండర్లు ఖరారు

తొలిదశలో 14,368 యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌

సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఏపీ టిడ్కోలో(ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) మొదటి దశలో 14,368 హౌసింగ్‌ యూనిట్లకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. ఈమేరకు రివర్స్‌ టెండర్లను గురువారం ఖరారు చేశారు.

నాలుగు జిల్లాల్లో రివర్స్‌ టెండర్లు
టీడీపీ హయాంలో పట్టణాల్లో ’అందరికీ ఇళ్ల పథకం’ కింద ఏపీ టిడ్కో  65,969 హౌసింగ్‌ యూనిట్లతో  ప్రాజెక్టులు చేపట్టింది. టీడీపీ పెద్దలకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేలా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో కంటే అత్యధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాధనాన్ని ఆదా చేస్తూ పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్‌ యూనిట్లకు దశలవారీగా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రధాన టెండర్లు పిలిచిన మర్నాడే రివర్స్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏపీ టిడ్కో  మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం  జిల్లాల్లో 14,368 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపట్టింది. తద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేసినట్లు  మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

‘రివర్స్‌’తో ఆదా ఇలా..
►చిత్తూరు జిల్లాలో 5,808 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి  ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌  టెండర్లు దాఖలు చేశాయి. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.271.03 కోట్ల విలువైన పనులకు 15 శాతం తక్కువకు అంటే రూ.2309.18 కోట్లకే ఆ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. చదరపు అడుగు రూ.1,321 చొప్పున టెండరు ఖరారు చేశారు. తద్వారా రూ.40.85 కోట్లు ఆదా అయ్యాయి.  
►కృష్ణా జిల్లాలో 2,064 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి  ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, కేఎంవీ ప్రాజెక్ట్స్, ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ బిడ్లు దాఖలు చేశాయి. ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.95.65 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.81.30 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. తద్వారా ఖజానాకు రూ.14.35 కోట్లు ఆదా అయ్యాయి.  చదరపు అడుగు రూ.1,312 చొప్పున టెండరు ఖరారు చేశారు.
►విశాఖపట్నం జిల్లాలో 3,424 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి టాటా ప్రాజెక్టŠస్‌ లిమిటెడ్, ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, ఇంద్రజిత్‌ మెహతా కన్‌ స్ట్రక్షన్స్‌ రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనగా ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.192.23 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.163.40 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. తద్వారా రూ.28.83 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. చదరపు అడుగుకు రూ1,304 చొప్పున ఈ టెండరు ఖరారు చేశారు.
►విజయనగరం జిల్లాలో 3,072 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి  వీఎన్‌సీ లిమిటెడ్, ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ రివర్స్‌  టెండర్లలో పాల్గొనగా ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. ఆ సంస్థ  రూ.148.12 కోట్ల విలువైన పనులకు 14.78 శాతం తక్కువకు అంటే రూ.126.24 కోట్లకు కోట్‌ చేసింది. తద్వారా ఖజానాకు రూ.21.88 కోట్లు ఆదా అయ్యాయి. ఈ సంస్థకు చదరపు అడుగు రూ.1,315 చొప్పున టెండరు ఖరారు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top