సామాన్యులకు ప్రభుత్వ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యంగా పని చేస్తానని జిల్లా కొత్త కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం వచ్చి
శ్రీకాకుళం సిటీ: సామాన్యులకు ప్రభుత్వ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యంగా పని చేస్తానని జిల్లా కొత్త కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం వచ్చి బాధ్యతలు స్వీకరించనున్న ఆయన శనివారం ‘సాక్షి’తో ఫోనులో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సంభాషణ విశేషాలు..
మీ కుటుంబ నేపథ్యం గురించి..
కలెక్టర్:వృత్తిరీత్యా వైద్యుడినైన నేను, అన్ని రంగాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ రాసి 2005లో ఐఏఎస్కు ఎంపికయ్యాను. మా నాన్నగారు ప్రేమ్నాథ్ ఉప్పల్ పంజాబ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. అమ్మ ఉష ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. భార్య కోమల్ చిన్నపిల్లల వైద్యురాలు. మాకు బ్రిగు అనే అబ్బాయి, డిజా అనే అమ్మాయి ఉన్నారు.
శ్రీకాకుళం వంటి ప్రాంతానికి వస్తున్నారు.. మీ లక్ష్యమేంటి?
కలెక్టర్: సామాన్యుల ప్రగతే నా లక్ష్యం. ఐఏఎస్ పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నంలో శిక్షణ పొందుతున్నప్పుడే శ్రీకాకుళం గురించి కాస్త తెలుసు. అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం ఇది. ఇలాంటి జిల్లాకు కలెక్టర్గా రావడమంటే ఎక్కువ సేవలు అందించే అవకాశం లభించినట్లేనని భావిస్తున్నాను.
రాష్ట్ర విభజన తర్వాత శ్రీకాకుళం రూపు మారేనా?
కలెక్టర్: ఖచ్చితంగా.. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇవ్వడంతో ఇక్కడి వనరుల గురించి తెలుసుకున్నాను. వ్యవసాయం, వ్యవసాయాధారిత, తీరప్రాంత అభివృద్ధి, విద్య ఇతరత్రా విభాగాల్లో అభివృద్ధి సాధ్యమేనని నమ్ముతున్నాను. అందుకు సాయశక్తులా కృషి చేస్తాను.
మీ అనుభవాలను ఎలా ఇక్కడ ఉపయోగిస్తారు?
కలెక్టర్: నేను మొదట విజయవాడ సబ్ కలెక్టర్గా, తర్వాతగుంటూరు, విజయవాడ జాయింట్ కలెక్టర్గా.. అలాగే హౌసింగ్ కార్పొరేషన్ ఈడీగా పనిచేశాను. గ్రామాల్లో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రతి పథకం పారదర్శకంగా అమలయ్యేలా చూస్తాను.