ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తా

Professor PVGD Prasad Reddy Assumes Duties As Vice Chancellor Of Andhra University - Sakshi

సామాజిక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారం

వర్సిటీ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక రూపకల్పన

రెండు ప్రతిష్టాత్మక సంస్థల సారథులు కొలువుదీరారు. నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించిన వీఎంఆర్డీయే చైర్మన్‌గా నియమితులైన ప్రభుత్వ మాజీ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాస్, ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా అదనపు బాధ్యతలు పొందిన ప్రొఫెసర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డిలు శుక్రవారం ఆయా సంస్థల కార్యాలయాల్లో అభిమానులు, సిబ్బంది కోలాహలం మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థల పాలనను, ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.

సాక్షి, ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి అన్నారు. విద్య, బోధనలకే పరిమితం కాకుండా ఏయూను సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా నిలుపుతామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య, విశాఖ కాలుష్యం వంటి వాటికి వర్సిటీ శాస్త్రీయ పరిష్కారాలు అన్వేషిస్తుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు వర్సిటీ వీసీగా ఆయన కార్యాలయంలో అదనపు బాధ్యతలను చేపట్టారు. మాజీ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ సమక్షం తొలి ఫైలుపై సంతకం చేశారు. అనంతరం తనను తీర్చిదిద్దన సోదరి డాక్టర్‌ పి.ఏ.ఎల్‌ రజని ఆశీస్సులు తీసుకున్నారు. వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.బైరాగిరెడ్డి ఆయన్ను అభినందించారు. డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మాజీ వీసీ ఆచార్య వై.సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య పేరి శ్రీనివాసరావు, రమణమూర్తి, సుమిత్ర, టి.వినోదరావు తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు.

సేవాకేంద్రం ఏర్పాటు
 వీసీ ఏయూ సెనేట్‌ మందిరంలో మీడియా ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. వర్సిటీలో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సేవలు, సమాచారం అందిస్తామన్నారు. విద్యార్థుల సమస్యలకు సత్వర పరిష్కారం అందించే దిశగా ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. రానున్న దశాబ్ద కాలం లో వర్సిటీలో చేసే అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను తాను సిద్ధం చేసుకున్నానని, దానిని త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. మాజీ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ, ఐఏఎస్‌ అధికారి ఎం.జి. గోపాల్‌ల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నారు. ఆచార్యునిగా తన 32 సంవత్సరాల ప్రయాణంలో విద్యార్థులే మంచి మిత్రులుగా నిలు స్తారన్నారు. నంబర్‌వన్‌ వర్సిటీగా ఏయూను నిలపాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

నిధుల తరలింపు వల్లే సమస్య
వర్సిటీకి అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమని, గత ఐదు సంవత్సరాలుగా నియామక ప్రక్రియలో లోపాల కారణంగా ఉద్యోగాలు భర్తీ చేయ డం సాధ్యపడలేదన్నారు. దీనికంటే పెద్ద సమస్య నిధుల కొరతేన్నారు. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీకి రావాల్సిన నిధులు పసుపు కుంకుమ పేరుతో తరలిపోయాయన్నారు. ముందుగా వీటిని తిరిగి తెచ్చుకోవడం ఎంతో అవసరమన్నారు. 

పేద విద్యార్థులకు అండగా..
పేద విద్యార్థులకు అండగా ఏయూ నిలుస్తుందన్నారు. వర్సిటీలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అదనపు సెక్షన్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో త్వరలో చర్చిస్తామని చెప్పారు.

వైఎస్సార్‌కు నివాళి
వీసీ బాధ్యతల స్వీకరణకు ముందు ఏయూ నిర్మాణానికి 1942లో వేసిన శిలాఫలకం వద్ద పూలు ఉంచారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి, మహాత్మాగాంధీ, జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్, వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం తా ను రిజిస్ట్రార్‌గా పని చేసిన సమయంలో వీసీ గా ఉన్న ఆచార్య బీల సత్యనారాయణ సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top