ఏ తల్లి కన్నబిడ్డలో వారు..కాలం తీరిపోయి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆఖరి మజిలీలో ఆరడగుల గుంతలో ప్రశాంతంగా నిద్రించే అదృష్టానికి కూడా నోచుకోలేని దురదృష్టవంతులు వారు.
కావలి: ఏ తల్లి కన్నబిడ్డలో వారు..కాలం తీరిపోయి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆఖరి మజిలీలో ఆరడగుల గుంతలో ప్రశాంతంగా నిద్రించే అదృష్టానికి కూడా నోచుకోలేని దురదృష్టవంతులు వారు. చివరకు పందులు, కుక్కలకు ఆహారంగా మారుతున్నారు. కావలి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే వారికి ఆ గతి పడుతోంది.
అనాథ మృతదేహాలనే ఉద్దేశంతో ఖననం చేయకుండానే శ్మశానంలో ఓ మూలన పడేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. కావలి పరిసర ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన గుర్తుతెలియని వారి మృతదేహాలను పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తుంటారు. అనారోగ్యంతో మృతిచెందిన వారు, రైలు, రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూసిన వారి మృతదేహాలు ఏరియా ఆస్పత్రికి చేరుతుంటాయి. వారి తాలుకూ కుటుంబసభ్యులు, బంధువుల కోసం కొద్ది రోజుల పాటు ఎదురుచూసి ఎవరూ రాని సందర్భాల్లో ఖననం చేసేందుకు మున్సిపాలిటీకి అప్పగిస్తారు. అయితే మున్సిపాలిటీ సిబ్బందిలో కొందరు మానవత్వాన్ని మరుస్తున్నారు.
అనాథల మృతదేహాలను రాత్రివేళలో తీసుకొచ్చి వైకుంఠపురం హిందూ శ్మశానవాటికలో వదిలేస్తున్నారు. వాటిని పందులు, కుక్కలు పీక్కు తినడం గమనించిన స్థానికులు విలవిలలాడిపోతున్నారు. దుర్గంధం వెదజల్లడంతో పాటు అప్పుడప్పుడూ మృతదేహాల భాగాలను కుక్కలు తీసుకొచ్చి ఇళ్ల మధ్య పడేస్తుండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మున్సిపల్ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని మండిపడుతున్నారు.
ఈ విషయాన్ని పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠపురం మధ్యలో ఉన్న ఈ శ్మశాన వాటిక మీదుగానే పెంకుల ఫ్యాక్టరీ గిరిజనకాలనీ, చెరువుకట్ట సంఘం, కావలి పెద్దచెరువు వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. కుళ్లిపోయిన మృతదేహాల నుంచి వెదజల్లుతున్న వాసనతో వారు తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనాథల మృతదేహాలను ఖననం చేసేలా చర్యలు చేపట్టాలని కావలి వాసులు కోరుతున్నారు. ఈ సమస్యను కావలి మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు.