తిరుమలలో వైభవంగా అమ్మవారి సారె ఊరేగింపు
తిరుమల: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి గురువారం పంచమి తీర్థ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి సంప్రదాయబద్ధంగా సారెను తీసుకెళ్లారు. వేకువజామున 4.30గంటలకు ఆలయం నుండి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, నైవేద్యాలను సంప్రదాయబద్ధంగా బాజాబజంత్రీలు, అర్చకుల వేదమంత్రాలతో తిరువీధుల్లో ఊరేగింపు జరిపారు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలును అమ్మవారికి కానుకగా సమర్పించనున్నారు.
మాడ వీధులలో ఊరేగించాక బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నడకమార్గంలో ఈ సారెను ఉదయం పంచమి తీర్థ ఘడియలకు ముందే తిరుచానూరు అమ్మవారికి చేర్చనున్నారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 11.48 గంటలకు అమ్మవారి పుష్కరిణిలో పంచమి తీర్థ (చక్ర స్నాన) మహోత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు సంయమనం పాటించి భద్రతా సిబ్బందికి సహకరించాలని టిటిడి విఙప్తి చేసింది.