తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరు | No going back on Telangana decision | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరు

Sep 17 2013 1:33 AM | Updated on Mar 18 2019 9:02 PM

కుట్రలెన్ని పన్నినా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు తథ్యమని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి స్పష్టంచేశారు.

ఆలంపల్లి, న్యూస్‌లైన్: కుట్రలెన్ని పన్నినా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు తథ్యమని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ వసతిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వివిధ సం ఘాల అభిప్రాయాలు, శ్రీకృష్ణ కమిటీ, ఎనిమిది గుర్తింపు ఉన్న పార్టీల అభిప్రాయాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీలో గత జూలై 30న తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందన్నారు. కొన్ని అవకాశవాద పార్టీలు ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతూ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు.
 
 తెలంగాణకు అనుకూలమని గతంలో చెప్పిన టీడీపీ తది తర పార్టీలు.. తీరా ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. సీమాంధ్ర ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, ఏపీఎన్జీవో ఎవరూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అడ్డుకోలేరన్నారు. సమైక్యవాదులు, అవకాశవాద పార్టీలను  ఈ ప్రాంతంలో నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణవాదులపై ఉందన్నారు.   పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. వ్యక్తిగత అభిప్రాయంతో చేస్తున్న ప్రకటనలను అధిష్టానం పట్టించుకోదన్నారు. అతి త్వరలో పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటు కానుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేతలు రణధీర్‌రెడ్డి, శామిలి, వికారాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జి గోపాల్‌రెడ్డి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సంతోష్, నాయకులు రాకేష్, శ్రీనివాస్, సుభాన్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రీకాంత్, జగన్, సతీష్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
 కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు
 పరిగి: కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు లభిస్తుందని వంశీచందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పరి గిలో ఏర్పాటు చేసిన యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో గ్రూపులతో సం బంధం లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించనుందన్నారు. తెలంగాణ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న విషయాన్ని గడప గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల పైనే ఉందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ ట్విట్టర్‌లో పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి పెట్టిన సందేశాన్ని అతి తక్కువ కాలంలోనే రెండు కోట్ల మంది చూశారన్నారు. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి యవతనే వెన్నెముకని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సమస్యలను గుర్తిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రణధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టంతో దేశంలో 67 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరనుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, రవీందర్, అశోక్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నస్కల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement