
రాజధాని నిర్మాణం ముందుకు సాగదు
రాజధాని నిర్మాణం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ముందుకు సాగదని బ్రహ్మశ్రీ మేడిచెర్ల హరికృష్ణ శర్మ స్పష్టం చేశారు.
విపక్షాలకు ప్రభుత్వం తలొగ్గాల్సిందే
ఇందిరా భవన్లో హరికృష్ణ శర్మ పంచాంగ శ్రవణం
హైదరాబాద్: రాజధాని నిర్మాణం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ముందుకు సాగదని బ్రహ్మశ్రీ మేడిచెర్ల హరికృష్ణ శర్మ స్పష్టం చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఇందిరా భవన్లో శనివారం ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల పక్షాన పోరాటాలు చేయడం వల్లే ప్రతిపక్ష పార్టీలు బలపడతాయని చెప్పారు. అలాగే ప్రతిపక్ష పార్టీల ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గక తప్పదని వివరించారు. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొననుందని దీంతో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని జోస్యం చెప్పారు.
అధికార, ప్రతిపక్ష సభ్యులకు సంయమనం కల్పించాలని కోరుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి విపక్షనేత సి.రామచంద్రయ్య ప్రార్థించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ప్రతిపక్షాలు చేసే సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలతో ముందుకెళ్లడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు కరువు, ఇతర కష్టాల నుంచి బయటపడి సుఖ శాంతులతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మాదాసు గంగాధరం, జంగా గౌతమ్, గిడుగు రుద్రరాజులు పాల్గొన్నారు.