సామాజిక భాద్యత(సీఎస్సార్) కింద డిసెంబర్ నాటికి 40 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర డెరైక్టర్ జి.రవిబాబు తెలిపారు.
మహారాణిపేట (విశాఖపట్నం) : సామాజిక భాద్యత(సీఎస్సార్) కింద డిసెంబర్ నాటికి 40 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర డెరైక్టర్ జి.రవిబాబు తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, ఐటీడీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 95లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 25లక్షల మంది వినియోగం సరిగ్గాలేదని గుర్తించామన్నారు. ఏజెన్సీలో అవగాహన లేక వాడడం లేదన్నారు. వారిలోని భయాందోళనలు తొలగించి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలకు సిలిండర్లు తరలించడం సమస్యగా ఉన్నందున 5 కేజీల సిలిండర్లు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నట్లు రవిబాబు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఆగస్టు నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తామన్నారు. ఈ పాస్ వల్ల నిజమైన లబ్ధిదారుడికి రేషన్ అందడమే కాకుండా ఇప్పటి వరకూ రూ.43 కోట్లు ఆదా అయిందన్నారు. 20శాతం సరకు మిగిలిందని రవిబాబు తెలిపారు. ప్రతి ఇంటికీ ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం వల్ల నెలకు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన కిరోసిన్ ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్, ఐటీడీఏ సబ్కలెక్టర్ వెంకటేశ్, విశాఖపట్నం, విజయనగరం డీఎస్ఓలు జె.శాంతకుమారి, నిర్మలాభాయి, ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఏఎస్ఓలు పాల్గొన్నారు.