
‘వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంగిత జ్ఞానం లేదు’
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ రాజీకీయ వ్యవహారాల పార్టీ కమిటీ సభ్యడు మైసూరారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ రాజీకీయ వ్యవహారాల పార్టీ కమిటీ సభ్యడు మైసూరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీ అని పిలవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించి బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి, హేతుబద్దత లేకపోవడానికి ఇదొక ఉదాహరణని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం.. ఆ పార్టీకే పరిమితమైనపుడు మిగతా పార్టీలు ఎలా మాట్లాడతాయన్నారు. జాతీయహోదా కల్గిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కన్నా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం అవలంభిస్తున్న తీరు రాజకీయ లబ్ధి కోసమే అని మైసూరా అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్లో హడావుడి చేసే కంటే.. గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన సూచించారు. టీడీపీ నేతలు పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారని మైసూరా ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోయే యోచనే వారి కుంటే గవర్నర్ వద్ద వెళితే సరిపోతుందన్నారు. పీసీసీ చీఫ్ అనుమతితో ఆంటోని కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలనడం హాస్యాస్పదమన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్ రాజ్యాంగ పరిధిని మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అసెంబ్లీ తీర్మానం అవసరమైందన్న విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ మరిచిపోయినట్లున్నారన్నారు.
ప్రజలకు అవసరమైన నదీ జలాల పంపకం, రాజధాని తదితర విషయాలపై చర్చించకుండానే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు అంశాన్ని ప్రకటించడాన్ని ఏ రకంగా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. సహజ వనరులు, మిగతా విషయాలపై చర్చించడానికి ఏ కమిటీ తమను కలవలేదన్న విషయాన్ని మైసూరా గుర్తు చేశారు.