మండలంలోని రామచంద్రపేట గ్రామంలో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన
భోగాపురం: మండలంలోని రామచంద్రపేట గ్రామంలో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అప్పలనర్సమ్మ(23)కు, అదే గ్రామానికి చెందిన కొయ్య గోవిందతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గోవింద రైతుకూలీ. అప్పలనర్సమ్మ కొద్దికాలంగా విజయనగరంలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విజయనగరం వెళ్లివస్తానని చెప్పి ఇంటి వద్ద నుంచి బయల్దేరింది. సాయంత్రం ఇంటికి చేరలేదు. అప్పటినుంచి అన్నిచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామానికి సమీపాన బావిలో ఆమె విగతజీవై పడి ఉండడాన్ని స్థానిక మహిళ గుర్తించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించింది. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఆమె వేసుకున్న దుస్తులను బట్టి అప్పలనర్సమ్మగా గుర్తించారు. ఎస్సై దీనబంధు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
ఏ కష్టం వచ్చిందో..
వివాహిత ఆత్మహత్యపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలేవీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత ఏ కష్టం వచ్చిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.