మార్కెటింగ్ శాఖ సర్వీసులో చేరింది మొదలు పలు వివాదాలు, ఆరోపణలు, విచారణలు ఎదుర్కొన్న సూపరింటెండింగ్ ఇంజనీరు(ఎస్ఈ) రాధాకృష్ణమూర్తి ఈ నెలాఖరులో రిటైర్ కావల్సి ఉంది.
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ సర్వీసులో చేరింది మొదలు పలు వివాదాలు, ఆరోపణలు, విచారణలు ఎదుర్కొన్న సూపరింటెండింగ్ ఇంజనీరు(ఎస్ఈ) రాధాకృష్ణమూర్తి ఈ నెలాఖరులో రిటైర్ కావల్సి ఉంది. ఈ తరుణంలో సర్వీసును పొడిగించుకునేందుకు పైరవీలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఈ సర్వీసు పొడిగింపు ఫైలు చకచకా కదులుతున్నట్లు సమాచారం. అసలు ఆయన ఎస్ఈగా ఎదిగిన తీరుపైనే అనేక వివాదాలున్నారుు. డిప్లమోతోనే సర్వీసులో చేరిన ఆయన పదోన్నతి కోసం సమర్పించిన డిగ్రీ పట్టా కూడా వివాదాస్పదమైంది.
ఆయన ఎస్ఈగా ఉన్న నాలుగేళ్లలో గోదాముల నిర్మాణంలో పలు అక్రమాలకు పాల్పడ్డట్టుగా కూడా ఆరోపణలున్నాయి. గతంలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుంటూరు మార్కెట్ యార్డుల అభివృద్ధి పనుల్లో ఆయన అక్రమాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, అవినీతి నిరోధక శాఖ నిర్ధారించింది. అయినా రాధాకృష్ణ సర్వీసు పొడిగింపు ఫైలును ముఖ్యమంత్రికి సన్నిహితులైన కాంగ్రెస్ నాయకులు పైరవీలతో చకచకా కదిలిస్తున్నట్లు సమాచారం.