న్యాయవాదులు సామాజిక నిర్మాతలు కావాలి
అనుభవజ్ఞులనే నాయమూర్తులుగా నియమించాలి: జస్టిస్ గొగొయ్
సాక్షి, అమరావతి: సామాజిక వివాదాల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని, వారు సామాజిక నిర్మాతలు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ 111వ వార్షికోత్సవం, జ్యుడీషియల్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో జస్టిస్ గొగొయ్తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. జస్టిస్ గొగొయ్ మాట్లాడుతూ.. అనుభవం, నైపుణ్యం ఉన్న న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బార్–బెంచ్ న్యాయ వ్యవస్థకు రెండు కళ్లు అన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. న్యాయ పరిపాలన తెలుగులోనే సాగాలని కోరారు. 1982–83లో న్యాయవాదిగా, ఆ తర్వాత బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరి సుప్రీం న్యాయమూర్తి స్థాయికి వెళ్లానని గత స్మృతులు నెమరేసుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న వివిధ అంశాలపై గేయాలు ఆలపించారు. కాగా.. జస్టిస్ గొగొయ్, జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం కుటుంబ సమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.