
కాపు నిరసన భగ్నం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ను నిరసిస్తు కర్నూలు నగరంలో కాపు, బలిజ సంఘం తలపెట్టిన.....
కర్నూలు(అర్బన్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ను నిరసిస్తు కర్నూలు నగరంలో కాపు, బలిజ సంఘం తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన నేతలను అరెస్ట్ చేసి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముద్రగడకు మద్దతుగా జిల్లా కాపు, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం వరకు నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల ప్రాంతంలో నేతలు ఒక్కొక్కరు శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగానే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో కాపు సంఘం నేతలు, పోలీసుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాము శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని, కాపు సంఘం నేతలు ప్రశ్నిస్తున్న సమయంలోనే పోలీసులు వారిని వ్యాన్ ఎక్కించి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సంఘం అధ్యక్షుడు యైశెట్టి నారాయణరెడ్డి, జీవీ విజయభాస్కర్, వీవీ ప్రభాకర్రెడ్డి, రామకృష్ణ, నల్లగట్ల పవన్, శోభన్బాబు, నరసింహరావు, రవి, చంద్రమోహన్, రంగస్వామి, శ్రీనివాసులు, కొండా విజయ్ ఉన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అరెస్టులో ఉద్యమాలను ఆపలేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు.