దోపిడీ కోసమే జన్మభూమి కమిటీల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

దోపిడీ కోసమే జన్మభూమి కమిటీల ఏర్పాటు

Published Tue, Apr 19 2016 12:34 AM

దోపిడీ కోసమే జన్మభూమి కమిటీల ఏర్పాటు

తక్షణం కమిటీలను రద్దు చేయాలి
రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం వెల్లడి


ఫిరంగిపురం : ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారిని దోచుకోమని ప్రజలపై వదిలేశారని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ధ్వజమెత్తారు. ఫిరంగిపురం మండల కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు తలకోల డేవిడ్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అంబేడ్కర్ పేరును కూడా తలచే అర్హతలేదని చెప్పారు. అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారాన్ని పొందిన ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకొని పాలన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఈ నెల 20న గుంటూరులోని మహిమా గార్డెన్స్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని మండల్లాలోని పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంధ విభాగాలనూ కలుపుకొని అన్ని వర్గాలతో కలిసి సామాజిక న్యాయ సాధికారిత యాత్ర ముగించామన్నారు. అనంతరం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ముగింపు సభలో పీసీసీ అధ్యక్షుడు రాఘవీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొంటారన్నారు. కొరివి వినయ్‌కుమార్, బండ్ల పున్నారావు, తలకోల డేవిడ్, తిరుపతి సత్యం, పాలపాటి అనీల్, పసల రాజు, దాసరిరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement