సాగునీటి సంఘాలకు ఎన్నిక లేదు | Irrigation is not the election of the unions says palle | Sakshi
Sakshi News home page

సాగునీటి సంఘాలకు ఎన్నిక లేదు

May 23 2015 1:00 AM | Updated on Aug 14 2018 5:56 PM

సాగునీటి సంఘాలకు ఎన్నిక లేదు - Sakshi

సాగునీటి సంఘాలకు ఎన్నిక లేదు

రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారనీ, ఈ సమయంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనీ గుర్తించిన కేబినెట్ ‘ఎంపిక’ మంత్రం జపించింది.

ఆయకట్టు రైతులతో సంప్రదింపులు జరిపి కమిటీల ఎంపిక
జూన్ 6నే రాజధానికి శంకుస్థాపన
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు

హైదరాబాద్: రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారనీ, ఈ సమయంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనీ గుర్తించిన కేబినెట్ ‘ఎంపిక’ మంత్రం జపించింది. సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా.. ఆయకట్టు రైతులతో సంప్రదింపులు జరిపి కమిటీలను ఎంపిక చేయడానికి ఆమోదం తెలిపింది. దొడ్డిదారిన ఎంపిక చేసిన సాగునీటి కమిటీలకు రూ.300 కోట్ల విలువైన పనులను అప్పగించి.. తెలుగుతమ్ముళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు వ్యూహం సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రసార, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు వెల్లడించారు.


రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కర్ణాటక తర హా మార్కెటింగ్ వి ధానం అమలు చే యాలని నిర్ణయం. వ్యాపారులు రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాలని నిర్ణయం. సరకు రవాణాకు ఈ-పర్మిట్ విధానం అమలు.  ప్రభుత్వ ఖర్చులతో క్రైస్తవులను జెరూసలెం యాత్రకు పంపడానికి  ఆమోదం.     గుంటూరుజిల్లాలో నానో మెట ల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎమ్‌ఎస్ హర్షదత్తు గ్రీన్ నానో టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భూమి కేటాయింపు.

ప్రకాశంజిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లిలో మోడల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు రవాణాశాఖకు 20 ఎకరాల భూమి కేటాయింపు. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ(కడా)లో 16 పోస్టులు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్‌పీడీసీఎల్)లో రెండు పోస్టులను కొత్తగా ఏర్పాటుచేయడానికి ఆమోదం.
 
జూన్ 6నే రాజధానికి శంకుస్థాపన
రాజధాని శంకుస్థాపనకు నిర్ణయించిన ముహూర్తం వివాదాస్పదమవుతుండటంపై కేబినెట్‌లో చర్చ సాగింది. చంద్రబాబు వ్యక్తిగత జ్యోతిష్యుడు శ్రీనివాస గార్గేయ సైతం రాజధాని శంకుస్థాపనకు ఖరారు చేసిన ముహూర్తాన్ని తప్పుపడుతోండటాన్ని ఓ సీనియర్ మంత్రి ప్రస్తావించారు. ముహూర్తాన్ని మార్చితే విమర్శలు వస్తాయని మరో సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే జూన్ 6న ఉదయం 8.49 గంటలకు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేద్దామని ప్రతిపాదించగా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని శంకుస్థాపనకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించింది. జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement