బోగస్‌ ఇళ్లు 16,111

Irregularities came out with the volunteer field level inspection on Bogus Homes - Sakshi

లబ్ధిదారులకు తెలియకుండా మంజూరు చేయించుకున్న టీడీపీ నేతలు

వలంటీర్ల క్షేత్ర స్థాయి పరిశీలనతో వెలుగులోకి అక్రమాలు

250 కోట్లు కాజేసే ఎత్తుగడ 

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో దాదాపు రూ.250 కోట్ల మేర ప్రజాధనం లూటీకి టీడీపీ నేతలు పథకం వేసినట్లు క్షేత్రస్థాయి విచారణతో వెల్లడైంది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రచారం చేసింది. స్థానిక టీడీపీ నేతలు గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా 16,111 మంది అనర్హులకు ఇళ్లను మంజూరు చేయించుకున్నట్లు తాజాగా గుర్తించారు.

టీడీపీ హయాంలో మంజూరై వివిధ స్థాయిల్లో ఆగిపోయిన ఇళ్ల వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ పేరుతో టీడీపీ నేతలు ఇళ్లు మంజూరు చేసుకున్నట్లు తేలటంతో గూడులేని పేదలు నివ్వెరపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లు  మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు ఇప్పటికే స్థలసేకరణలో నిమగ్నమయ్యారు. 

అనర్హులకు ఇళ్లు ఇలా..
- ఇతరుల రేషన్‌కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వారికి తెలియకుండా కొందరు అనర్హులు ఇళ్లు నిర్మించుకున్నారు.
ఒకే ఇంటిలో ఇద్దరి పేర్లతో ఇళ్లు మంజూరు చేయించుకుని ఉమ్మడిగా పెద్ద భవంతులు నిర్మించుకున్నవి మరికొన్ని.  

బిల్లులు నిలిపివేస్తాం.. 
‘గత ప్రభుత్వ హయాంలో 16,111 మంది అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు క్షేత్రస్థాయి విచారణలో గుర్తించాం. ఈ బిల్లులు చెల్లించరాదని ఆదేశించాం. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’  
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు (గృహ నిర్మాణ శాఖ మంత్రి) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top