భార్యపై కత్తితో దాడి

Husband And Wife Knife Attack In Vizianagaram - Sakshi

భార్యాభర్తలిద్దరికీ గాయాలు..

విజయనగరం, శృంగవరపుకోట రూరల్‌: భార్యపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఎస్‌.కోట మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎస్‌.కోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యర్రా లీల (24)ను లక్కవరపుకోట మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఎర్నాయుడుకు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం చేశారు. కొద్దికాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం అనుమానంతో ఎర్నాయుడు తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు.

ఇదిలా ఉంటే  లీల ఇటీవల గర్భం దాల్చింది. ఒంట్లో నీరసంగా ఉండడంతో దసరా పండుగ ముందు కొత్తూరులోని అమ్మగారింటికి వచ్చింది. గురువారం సాయంత్రం అత్తారింటికి వచ్చిన ఎర్నాయుడు శుక్రవారం సాయంత్రం భార్య లీలతో గొడవపడ్డాడు. నాతో ఇంటికి వస్తావా..? రావా..? అంటూ ప్రశ్నించాడు. దీపావళి తర్వాత వస్తానని లీల చెబుతుండగా, తాటికమ్మలు నరికే కత్తితో చేతులు, వీపుపై దాడి చేశాడు. అనంతరం కత్తితో తన చేతిపై కూడా గాయం చేసుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి వారిద్దరినీ  ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నా భార్యే దాడి చేసింది..
ఇంటికి వస్తావా,  రావా అని నా భార్యను నిలదీశాను. ఇంతలో గ్యాస్‌స్టవ్‌ సమీపంలో ఉన్న కత్తితో నాపై దాడి చేసింది. ఆమె చేతిలో ఉన్న కత్తి తీసుకునే ప్రయత్నంలో నాకు గాయమైంది. అనంతరం ఆమెపై చిన్నగా దాడి చేశాను.    – ఎర్నాయుడు, నిందితుడు

కట్నం కోసం హింసిస్తున్నాడు  
 పెళ్‌లైనప్పటి నుంచి మా అల్లుడు ఎర్నాయుడు కట్నం కోసం నా కుమార్తెను వేధిస్తున్నాడు. ఎవరితో మాట్లాడినా అనుమానం కట్టి హింసిస్తున్నాడు.  నేను ఇంట్లో లేని సమయంలో నా కుమార్తెపై దాడి చేశాడు.
– అప్పలకొండ, బాధితురాలి తల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top