ఇళ్లు కాదు కన్నీళ్లు | Hudhud cyclone victims homes for only few | Sakshi
Sakshi News home page

ఇళ్లు కాదు కన్నీళ్లు

May 31 2015 12:03 AM | Updated on Nov 9 2018 5:52 PM

హుద్‌హుద్ తుఫాన్ బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల్లో నాలుగో వంతుకు మాత్రమే కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

హుద్‌హుద్ బాధితుల్లో కొందరికే ఆవాసం
66,390 ఐఏవై ఇళ్లకు ప్రతిపాదనలు
15,219 మంజూరు చేసిన కేంద్రం
జన్మభూమి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత

 
 సాక్షి, విశాఖపట్నం :  హుద్‌హుద్ తుఫాన్ బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల్లో నాలుగో వంతుకు మాత్రమే కేంద్రం ఆమోద ముద్ర వేసింది. విశాఖ జిల్లాకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 66,390 ఐఏవై ఇళ్లు మంజూరు చేయాలని కోరగా 15,219 ఇళ్లను మాత్రమే మంజూరుచేసింది. వీటి కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీల చేతుల్లో పెడుతున్నారు.  గతేడాది అక్టోబర్ 12వ తేదీన విరుచుకుబడిన హుద్‌హుద్ తుఫాన్ దాటికి ఒక్క విశాఖ జిల్లాలోనే   లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి.  

కనీసం మరమ్మతులు కూడా చేయించుకునే  స్తోమత  లేని వందలాది మంది ఇంకా మొండి గోడలు, కూలిన పూరిగుడెసల మధ్యే జీవనం సాగిస్త్తున్నారు. తుఫాన్ వచ్చి  ఎనిమిది నెలలు గడిచినా ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు.  గ్రామీణ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సాయం కోసం ఎదురుచూపులే తప్ప రాష్ర్టం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఐఐవై కింద జిల్లాకు కనీసం 63,390 ఇళ్లు మంజూరు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఐఏవై కింద ఏ జిల్లాకైనా    ఏటా ఐదు నుంచి 10 వేల ఇళ్లలోపు మాత్రమే కేంద్రం మంజూరు చేస్తుంటుంది.

కనీవినీ ఎరుగని తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టంజరిగినందున పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా కనీసం ఐదేళ్ల పాటు మంజూరు  చేసే ఇళ్లను ఒకేసారి మంజూరుచేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం మాత్రం 15,219 ఇళ్లను మంజూరు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 8837 ఇళ్లను మంజూరు చేయగా, 2014-15లో 7015  మంజూరు చేశారు. గతేడాది మంజూరైన ఇళ్లల్లో  3002 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

 ఇక ఈ ఏడాది హుద్‌హుద్ నేపథ్యంలో ఐఏవై కింద జిల్లాకు అత్యధిక కేటాయింపులు జరిపింది. విశాఖ గ్రామీణ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 39 మండలాల్లో హుద్‌హుద్‌కు దెబ్బతిన్న లబ్ధిదారులకు వీటిని కేటాయించనున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల మాదిరిగానే వీటిని కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.   ఇటీవలే దాతల సహకారంతో ఉత్తరాంధ్ర పరిధిలోని మూడు జిల్లాలకు రూ.560 కోట్లతో 10వేల ఇళ్ల నిర్మాణానికి  ఆదేశాలు జారీ చేయగా, వాటిలో ఆరు వేలు విశాఖ జిల్లాలోనే నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు   గత నెల 28న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉండగా  వాయిదాపడిన విషయం  విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement