23కు చేరిన హెచ్‌పీసీఎల్‌ మృతులు | HPCL refinery accident death toll rises to 23 | Sakshi
Sakshi News home page

23కు చేరిన హెచ్‌పీసీఎల్‌ మృతులు

Sep 2 2013 12:37 AM | Updated on Sep 1 2017 10:21 PM

హెచ్‌పీసీఎల్‌లో గతనెల 23న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 23కు చేరుకుంది.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: హెచ్‌పీసీఎల్‌లో గతనెల 23న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 23కు చేరుకుంది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురు క్షతగాత్రులు ఆదివారం మృతిచెందారు. విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో సుభాష్ లోహ్రా(25), న్యూకేర్ ఆస్పత్రిలో ఎం.వి.రమణ(45), మణిపాల్ ఆస్పత్రిలో కె.తాతారావు(60), ముంబైలోని బర్న్స్‌వార్డులో సాంబుమన్నా(55) చికిత్స పొందుతూ మృతిచెందినట్టు హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.వి నరసింహం తెలిపారు.
 
 హెచ్‌పీసీఎల్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాంబుమన్నా మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ అనంతరం ముంబై నుంచి కోల్‌కతా తరలించామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ప్రస్తుతం ముంబైలో ఏడుగురు, విశాఖలో 10 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.  వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నలుగురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారన్నారు. ఆదివారం ముగ్గురు డిశ్చార్జి అయ్యారన్నారు. ఇదిలా ఉండగా,  ప్రమాద స్థలంలో చెత్తా చెదారాన్ని తొలగించి సంచుల్లో ఉంచామని రెండు, మూడు రోజుల్లో రిఫైనరీ పరిశుభ్రం చేస్తామని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషన్ ప్యాకేజీ వర్తించేలా చర్యలు చేపడుతున్నట్లు నరసింహం తెలిపారు.

Advertisement

పోల్

Advertisement