Visakha Refinery
-
23కు చేరిన హెచ్పీసీఎల్ మృతులు
విశాఖపట్నం, న్యూస్లైన్: హెచ్పీసీఎల్లో గతనెల 23న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 23కు చేరుకుంది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురు క్షతగాత్రులు ఆదివారం మృతిచెందారు. విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో సుభాష్ లోహ్రా(25), న్యూకేర్ ఆస్పత్రిలో ఎం.వి.రమణ(45), మణిపాల్ ఆస్పత్రిలో కె.తాతారావు(60), ముంబైలోని బర్న్స్వార్డులో సాంబుమన్నా(55) చికిత్స పొందుతూ మృతిచెందినట్టు హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.వి నరసింహం తెలిపారు. హెచ్పీసీఎల్ గెస్ట్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాంబుమన్నా మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ అనంతరం ముంబై నుంచి కోల్కతా తరలించామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ప్రస్తుతం ముంబైలో ఏడుగురు, విశాఖలో 10 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నలుగురికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారన్నారు. ఆదివారం ముగ్గురు డిశ్చార్జి అయ్యారన్నారు. ఇదిలా ఉండగా, ప్రమాద స్థలంలో చెత్తా చెదారాన్ని తొలగించి సంచుల్లో ఉంచామని రెండు, మూడు రోజుల్లో రిఫైనరీ పరిశుభ్రం చేస్తామని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషన్ ప్యాకేజీ వర్తించేలా చర్యలు చేపడుతున్నట్లు నరసింహం తెలిపారు. -
మరో మూడు మృతదేహాలు లభ్యం?
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. ఎనిమిది మంది మృతిచెందినట్టు ప్లాంట్ యాజమాన్యం చెబుతోంది. అయితే పదిమంది మరణించినట్టు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. తాజాగా ఆదివారం ప్లాంటు శిథిలాలు, సంప్ బయట ప్రాంతం నుంచి గుర్తు పట్టడానికి వీల్లేని రీతిలో మూడు మృతదేహాలు బయటపడినట్టు ప్లాంటు వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కొందరు సిబ్బంది వెల్లడించారు. దీంతో పేలుడు ఘటనలో దుర్మరణం పాలైన వారి సంఖ్య 13కు చేరినట్లయింది. అయితే ప్లాంటు యాజమాన్యం మాత్రం ఈ మృతులను ధ్రువీకరించడం లేదు. కాగా పేలుడు నేపథ్యంలో చెలరేగిన మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి బూడిదవడంతో ఆనవాళ్లు దొరకడం లేదన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 37 మందిలో తొమ్మిదిమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మిగిలిన వారిలోనూ కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉండగా కూలింగ్ టవర్ కూలిన ప్రాంతంలో అయిదు సంప్లుండగా.. వీటిలో ఒకటి, రెండు, ఐదు సంప్ల్లో శిథిలాల తొలగింపు పూర్తయింది. మూడు, నాలుగు సంప్ల్లో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. దేవదారు చెక్క, రసాయన షీట్లు కాలిపోవడంతో సంప్ మొత్తం బూడిదతో నిండిపోయింది. వీటిని తొలగించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్పీసీఎల్ చైర్మన్ ఎస్.రాయ్చౌదరి ఆదివారం ఢిల్లీనుంచి వచ్చి ప్లాంట్ పరిసరాలను పరిశీలించారు. మూడు యూనిట్ల మూసివేత హెచ్పీసీఎల్ ప్రస్తుతం పూర్తిసామర్థ్యంతో నడుస్తోంది. అయితే ప్రమాద ఘటన నేపథ్యంలో కూలింగ్ టవర్ కూలిపోవడంతో దానితో అనుసంధానమై పనిచేయాల్సిన మూడు యూనిట్లను తాత్కాలికంగా అధికారులు మూసేశారు. మరోవైపు కాంట్రాక్టు కార్మికులు సుమారు రెండువేల మందికిపైగా విధులు బహిష్కరించడంతో కొన్ని పనులు ఆగిపోయాయి. కంపెనీ ఉద్యోగులు సైతం ప్రస్తుతం విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు.