
వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
సంతలో గొర్రెలు విక్రయించేందుకు బయలుదేరిన ముగ్గురు గొర్రెల కాపరులు వరదనీరు నీటిలో చిక్కుకున్నారు.
(అనిల్ కుమార్, సాక్షి - నందిగామ)
సంతలో గొర్రెలు విక్రయించేందుకు బయలుదేరిన ముగ్గురు గొర్రెల కాపరులు వరదనీరు నీటిలో చిక్కుకున్నారు. ఆ సంఘటన కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని మున్నేటి వాగులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... రాఘవాపురానికి చెందిన మంచాల పవన్, మంచాల వెంకటేశ్వర్లు, ఎర్రగొళ్ల శ్రీనులు దాదాపు 25 గొర్రెలను నందిగామ లో ఈ రోజు జరిగే వారాంతపు సంతలో విక్రయించేందుకు బయలుదేరారు.
ఆ క్రమంలో వారు మున్నేటి వాగులోకి లంక పొలాల నుంచి ప్రయాణిస్తుండగా... వాగులోకి ఒక్కసారిగా వరద నీరు భారీగా వచ్చి చేరింది. దాంతో ఆ ముగ్గురు గొర్రెల కాపరులతోపాటు గొర్రెలు కూడా వరద నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకున్నారు. వారిని, వారితోపాటు గొర్రెలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో నిన్నటీ వరకు ఖాళీగా ఉన్న మున్నేటి వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.