హెరిటేజ్.. ‘టెట్రా’షాక్!
వినియోగదారులపై రూ.2 దాకా వడ్డన
బొబ్బిలి: ఒకపక్క కరోనా కలకలం.. మరోవైపు లాక్డౌన్ వల్ల నిత్యావసరాల కోసం సామాన్యులు అల్లాడుతున్న సమయంలో హెరిటేజ్ కంపెనీ పాల ధర పెంచేసింది. హెరిటేజ్ స్పెషల్ మిల్క్ టెట్రా ప్యాకెట్లపై జనవరి నుంచి రూ.2 వరకు ధరలు పెరిగాయి. జనవరి 26న తొలుత రూపాయి పెంచగా మార్చి 1న మరోసారి రూపాయి చొప్పున పెంచారు. ప్రస్తుతం అరలీటర్ రూ.27 చొప్పున విక్రయిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో దాదాపు 36 వేల మంది పాడి రైతులు హెరిటేజ్ మిల్క్ సెంటర్లకు పాలు పోస్తున్నారు. ప్రతి నెలా 1 నుంచి 14 వరకు, తిరిగి నెలాఖరు వరకు వారికి రెండు బిల్లులను చెల్లిస్తున్నారు. పాలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తామూ రైతులకు ధరలు పెంచుతున్నట్లు హెరిటేజ్ తెలిపింది. అయితే ఇంతవరకు రైతులకు పెంచకుండానే రిటైల్ విక్రయదారులకు మాత్రం టెట్రా ప్యాకెట్ల మీద రెండు సార్లు రేట్లు పెంచింది.