గిన్నిస్ రికార్డు సాధిస్తాం
ఏపీఎస్ఆర్డబ్ల్యూఎస్ కార్యదర్శి కల్నల్ రాములు
నేడు చుండూరులో 42 కి.మీ మారథాన్
230 పాఠశాలల్లో అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో 42 కిలోమీటర్ల మారథాన్ శనివారం నిర్వహిస్తామని సొసైటీ కార్యదర్శి కల్నల్ వి. రాములు తెలిపారు. మారథాన్ గుంటూరు జిల్లా చుండూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై భట్టిప్రోలులోని బుద్ధ స్థూపం వద్ద ముగుస్తుందన్నారు. మారథాన్లో గురుకులాలకు చెందిన 150 మంది బాలికలు పాల్గొంటారని చెప్పారు. గతంలో 42 కిమీ మారథాన్ 3.09 గంటల్లో పూర్తిచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారన్నారు. ఆ రికార్డును అ«ధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అలాగే మరో రికార్డును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సంఘం శరణం గచ్ఛామీ పేరుతో అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటికను శనివారం సాయంత్రం 4.30 నుంచి 6.00 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 230 పాఠశాలల్లో ప్రదర్శించనున్నన్నామని చెప్పారు. ఒక నాటికను ఏకకాలంలో 230 పాఠశాలల్లో ప్రదర్శించడం ఇదే ప్రథమమన్నారు. తద్వారా కచ్చితంగా గిన్నీస్ రికార్డు నెలకొల్పుతామన్నారు. అదే విధంగా గురుకులాలకు చెందిన 22 మంది విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించేందుకు చైనాకు ఆదివారం పయనమవుతున్నారన్నారు. గతంలో అనేక గిన్నిస్ రికార్డులు సృష్టించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల విద్యాలయాల విద్యార్థులకు ఉందని వివరించారు. సమావేశంలో సొసైటీ డెప్యూటీ సెక్రటరీ ప్రతిభాభారతి పాల్గొన్నారు.