నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్‌ –19 | GSat-19 into the Designated orbit | Sakshi
Sakshi News home page

నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్‌ –19

Jun 11 2017 3:57 AM | Updated on Sep 5 2017 1:17 PM

నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్‌ –19

నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్‌ –19

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 డీ 1 రాకెట్‌ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 డీ 1 రాకెట్‌ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జీశాట్‌–19 ఉపగ్రహాన్ని నాలుగు విడతలుగా కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ శనివారం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహం లామ్‌ ఇంజిన్‌లోని 1,742 కిలోల ఇంధనాన్ని రెండు విడతలుగా వినియోగించి కక్ష్య దూరాన్ని పెంచారు. 8వతేదీ వేకువజామున 2.03 గంటలకు 116 సెకన్ల పాటు ఒకసారి, మళ్లీ అదేరోజు సాయంత్రం 3.44 గంటలకు 5,538 సెకన్ల పాటు లామ్‌ ఇంజిన్లను రెండోసారి మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు.

ఈనెల 5వతేదీన సాయంత్రం 5.28 గంటలకు షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ1 రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపిన జీశాట్‌–19 ఉపగ్రహాన్ని 170 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హసన్‌లోని నియంత్రణ కేంద్రం(ఎంసీఎఫ్‌) ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టింది. శనివారం ఉదయం 7.59 గంటలకు నాలుగోసారి అంటే ఆఖరి విడతగా 488 సెకెన్ల పాటు ల్యామ్‌ ఇంజిన్లు మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా స్థిరపరిచారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత సోలార్‌ ప్యానెల్స్‌ విచ్చుకుని చక్కగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహం సుమారు పదేళ్ల పాటు సేవలను అందిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement