మెడికల్ పీజీ సీట్ల వివాదంపై సీబీ సీఐడీ విచారణ | Governor orders CBCID enquiry on Medical PG entrance test | Sakshi
Sakshi News home page

మెడికల్ పీజీ సీట్ల వివాదంపై సీబీ సీఐడీ విచారణ

Mar 24 2014 9:40 PM | Updated on Oct 9 2018 7:52 PM

మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సీబీసీఐడీ విచారణకు గవర్నర్ నరసింహన్ ఆదేశించారు.

హైదరాబాద్: మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సీబీసీఐడీ విచారణకు గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించారు.

పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 18న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈఎల్‌ఎస్ నరసింహన్ వెంటనే విచారణకు ఆదేశించారు.  రాష్ట్ర  ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ 100లోపు ర్యాంకులు సాధించిన  11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులపై అనుమానం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విచారణలో  ప్రాథమికంగా గుర్తించిన  అంశాలను వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు.

19వ తేదీన హెల్త్ యూనివర్సిటీకి చేరుకుని మూల్యాంకన ప్రక్రియపై ప్రాథమికంగా విచారణ చేశామని అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. అనంతరం 20వ తేదీ గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల యంలో బహిరంగ విచారణ చేయగా,  200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  హాజరయ్యారన్నారు. విద్యార్థులు నిర్ధిష్టంగా ఫిర్యాదు చేయనప్పటికీ వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించగా, మొదటి 100లోపు మంచి  ర్యాం కులు సాధించిన  11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులపై ప్రాథమికంగా అనుమానిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement