చేదు మాత్ర


తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులను ప్రభుత్వం సైతం చిన్నచూపు చూస్తోంది. వారంతా విధిగా వాడాల్సిన మందుల సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రంలో 46 ప్రభుత్వ ఆస్పత్రులలో యాంటీ రిట్రోవల్ థెరఫీ (ఏఆర్‌టీ) సెంటర్లు ఉండగా, వీటిద్వారా సుమారు 4 లక్షల 60 వేల మంది రోగులకు నెలనెలా వ్యాధి నివారణ, నిలుపుదల మందులను ఉచితంగా పంపిణీ చేయూల్సి ఉంది. వీటికి నెల రోజులుగా ఈ మందులేవీ సరఫరా కావడం లేదు. దీంతో జిల్లాలోని మూడు ఏఆర్‌టీ సెంటర్లలోనూ మందులు నిండుకున్నాయి. రోగి శరీరంలో సీడీ 4 కౌంటు 350 కన్నా తక్కువ ఉంటే తప్పనిసరిగా ఏఆర్‌టీ చికిత్స మొదలు పెట్టాలి.

 

 రోగి లక్షణాలను బట్టి జిడో ఉడిన్, ల్యామి ఉడిన్, నెవిరోఫిన్, ఎఫావిరింజ్, టెనోఫేవిర్ కాంబినేషన్‌లో మందులు వాడతారు. జెడ్‌ఎల్‌ఎన్, జెడ్‌ఎల్‌ఈ, టీఎల్‌ఈ, టీఎల్‌ఎన్ మందులను పెద్దవారికి ఇస్తారు. పిల్లలకైతే ఎన్‌వీపీ కాంబినేషన్ మందులు సరఫరా చేయాలి. ఈ మందులను వాడేవారిలో సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించడానికి నెవిరోఫిన్ టాబ్లెట్లు వాడటం తప్పనిసరి. వీటిని రోగి రోజుకు రెండు చొప్పున వాడాలి. ఈ బిళ్లలు రాష్ట్రంలోని 46 ఏఆర్‌టీ సెంటర్లకు నెల రోజులుగా సరఫరా కావటం లేదు. నెలకు సరిపడే ఈ మందులను మార్కెట్‌లో కొనాలంటే రూ.850 వెచ్చించాలి. 

 

 హెచ్‌ఐవీ మహమ్మారి బారిన పడి కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై పునరావాస కేంద్రాలు, దాతల సహాయ, సహకారాలతో నడిచే కేంద్రాల్లో ఉంటున్న వారికి అంత మొత్తం వెచ్చించటం తలకు మించిన భారంగా మారింది. ఈ మందుల కోసం బాధితులు ఏఆర్‌టీ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. వారు వైద్యాధికారులను అడిగితే ‘రేపు వస్తాయి, మాపు వస్తాయి’ అంటూ చెబుతున్నారు. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ (నాకో) నుంచి ఏపీ శాక్స్‌కు, అక్కడి నుంచి ఏఆర్‌టీ సెంటర్లకు ఈ మందులు వస్తాయి.

 

 పరీక్ష కిట్లూ లేవు

 ఏరియా ఆస్పత్రులలోని ఐసీటీసీ కేంద్రాలలో హెచ్‌ఐవీ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయడానికి కిట్లు కూడా నెలరోజులుగా లేవు. హెచ్‌ఐవీ సోకిందన్న అనుమానం ఉన్న వారు బయట ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకొని , రిపోర్టును ఏఆర్‌టీ కేంద్రాలకు అందిస్తే , దాని కనుగుణంగా మందులు ఇస్తున్నారు. 

 

 మందులు రావాలి

 ఏఆర్‌టీ సెంటర్లకు కొన్ని రోజులుగా నెవిరోఫిన్ మందు బిళ్లలు సరఫరా చేయడం లేదని  తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ దామోద ర రెడ్డి చెప్పారు.  ఐసీటీసి కేంద్రాలలో ర క్త పరీక్ష కిట్లూ లేవని, అధికారులను అడిగితే త్వరలో పంపిస్తామంటున్నారని తెలిపారు. ఏఆర్‌టీ కేంద్రాలలో పిల్లల డోస్ (50 ఎంజీ) బిళ్లలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పెద్దల డోస్ (200 ఎంజీ) బిళ్లలు లేవని గూడెం ఏఆర్‌టీ కేంద్రం సహాయ వైద్యాధికారి ఎస్.వెంకటరమణ తెలిపారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top