అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు  | Gandham Chandrudu Appointed As Anantapur New Collector | Sakshi
Sakshi News home page

అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు 

Nov 30 2019 7:48 AM | Updated on Nov 30 2019 7:48 AM

Gandham Chandrudu Appointed As Anantapur New Collector - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లా  కలెక్టర్‌గా  గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా  ఉన్న సత్యనారాయణను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ కులాల సహకార ఆర్థిక సంస్థ (ఏపీ ఎస్‌సీసీఎఫ్‌సీ) ఎండీగా నియమించింది. ఇక జిల్లా కలెక్టర్‌గా నియమితులైన గంధం చంద్రుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌కులాల సహకార ఆర్థిక సంస్థ (ఏపీ ఎస్‌సీసీఎఫ్‌సీ) వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.  

సివిల్స్‌లో 198వ ర్యాంకు 
2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి గంధం చంద్రుడు స్వస్థలం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామ. లేపాక్షి నవోదయలో చదువుకున్న Výæంధం చంద్రుడు, ఆతర్వాత సికింద్రాబాద్‌లోని రైల్వే కళాశాలలో చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత దక్షిణమధ్య రైల్వే డివిజన్‌లో టికెట్‌ ఎగ్జామినర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2010లో సివిల్స్‌ రాసి 198 ర్యాంకు సాధించారు. ఐఏఎస్‌ శిక్షణ అనంతరం మెదక్‌  అసిస్టెంట్‌ కలెక్టర్‌గా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా, ఐటీడీఏ పీఏగా పనిచేశారు. ఆ తర్వాత సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా వ్యవహరించారు. జాయింట్‌ కలెక్టర్‌గా 2015 మార్చి 5న కృష్ణా జిల్లా బాధ్యతలు తీసుకున్నారు. 2017లో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019 జూలై నుంచి ఏపీ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్, ఎండీగా పనిచేశారు. తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.    

‘సంక్షేమం’పై సత్యనారాయణ మార్క్‌ 
సత్యనారాయణ ఈ ఏడాది జూన్‌ 7వ తేదీన కర్నూలు జిల్లా నుంచి బదిలీపై అనంతకు వచ్చారు. కేవలం 5 నెలల 22 రోజులు మాత్రమే ఆయన కలెక్టరుగా విధులు నిర్వర్తించారు. ఈ కాలంలోనే జిల్లాలో సంక్షేమ హాస్టళ్లపై దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీలు, రాత్రి బస చేస్తూ సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు పలు సమస్యలు తీర్చారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా కృషి చేశారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపైనా వేటు వేశారు. ఇక రైతు భరోసా అమలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement