
నిరుపేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు
గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంట చేసుకునే నిరుపేద మహిళల కష్టాలు ఇకపై తీరనున్నాయి.
► స్మోక్ఫ్రీ గ్రామాల ఎంపికకు రంగం సిద్ధం
► సర్వే మొదలుకు ఆదేశాలు జారీ
► జిల్లాలో లక్ష గ్యాస్ కనెక్షన్ల పంపిణీకి చర్యలుఔ
సాక్షి, కర్నూలు: గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంట చేసుకునే నిరుపేద మహిళల కష్టాలు ఇకపై తీరనున్నాయి. స్మోక్ఫ్రీ (పొగ రహిత) గ్రామాల సాధన లక్ష్యంగా కేంద్రం 2016-17 బడ్జెట్లో కేటాయించిన రూ. 2 వేల కోట్లతో బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు పంచాయతీరాజ్ శాఖ సహకారంతో సర్వే మొదలు పెట్టాయి. ఈ సర్వే పూర్తయితే మొదటి దశలో జిల్లాలోని ప్రతి మండలంలో కనీసంగా మూడు గ్రామాలు పొగ రహితంగా మారనున్నాయి. జిల్లాలో హెచ్పీ, ఐఓసీ, బీపీసీ ఆయిల్ కంపెనీల ద్వారా 5.45 లక్షల కుటుంబాలకు వంట గ్యాస్ సరఫరా అవుతోంది.
ఇటీవల దీపం పథకం ద్వారా లక్ష వరకు కనెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కనెక్షన్కు రూ. 1,600 రాయితీని భరించి మహిళలకు వీటని అందజేశారు. దీంతో జిల్లాలో గ్యాస్తో వంటచేసే కుటుంబాల సంఖ్య ఆరు లక్షలు దాటింది. దీపం ద్వారా డిపాజిట్ చెల్లించి గ్యాస్ కనెక్షన్ను పొందలేని నిరుపేద కుటుంబాలను గుర్తించి దశలవారీగా గ్రామాలను పొగ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్రం ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎలాంటి డిపాజిట్ లేకుండా గ్యాస్ కనెక్షన్(సిలిండర్, రెగ్యులేటర్)ను నిరుపేద కుటుంబాలకు అందిస్తారు. గ్యాస్ స్టౌవ్ మాత్రం పథకంలో చేర్చలేదు.
త్వరలో లబ్ధిదారుల ఎంపిక
ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని అమలు చేసేందుకు మండల పరిషత్తులు ఆ మండలాల పరిధిలోని పంచాయతీల సర్పంచుల సహకారంతో లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఈ దిశగా ఆయా గ్యాస్ డీలర్లకు, మండల పరిషత్తులకు ఆదేశాలు అందాయి. ఇలా పంచాయతీకి కనీసంగా 15 కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఆయిల్ కంపెనీలు తమ పరిధిలోని గ్యాస్ డీలర్లకు నిర్ధేశించాయి.