సమాచారం లేకుండా కేబినెట్కు రావద్దు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్రిశాట్తో ఒప్పందం కుదుర్చుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక్రిశాట్ మనవద్దకు రాదని, మనమే వారి వద్దకు వెళ్లాలని చెప్పారు. అలాగే వ్యవసాయ మిషన్ పనితీరు ఎంతవరకు వచ్చిందని కూడా ఆయన ప్రశ్నించారు. దానికి కూడా మంత్రి పుల్లారావు సమాధానం చెప్పలేకపోవడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు కేబినెట్ సమావేశాలకు వచ్చేటప్పుడు సమాచారంతో రావాలని, సమాచారం లేకపోతే అసలు సమావేశానికి రావద్దని అన్నారు. కాగా, కేబినెట్ సమావేశంలో పింఛన్ల ఏరివేత అంశంపై ఎనిమిది మంది మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో ఎక్కువ పింఛన్లను తొలగిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇపుడున్న నిబంధనలను మార్చేది లేదని, అర్హులకు అన్యాయం జరగకుండా మాత్రం చూస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.