వైఎస్సార్‌సీపీలో చేరిన దొంతు శారద దంపతులు

Dhonthu Couple Joined In Ysrcp - Sakshi

సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె భర్త దొంతు బాలకృష్ణ, పలువురు కౌన్సిలర్లతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీడీపీలో ఆమెకు ప్రాధాన్యం లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహారశైలి కారణంగా కొంతకాలంగా వారిద్దరి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. వెంకటగిరి పట్టణంలో చేనేత వర్గానికి చెందిన చైర్‌పర్సన్‌ దొంతు శారద దంపతులకు మంచి పట్టు ఉంది. ఆమె సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చైర్‌పర్సన్‌ శారద దంపతులు చేరిక వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరింది.

చైర్‌పర్సన్‌తో మున్సిపల్‌ కౌన్సిలర్లు మల్లికార్జున్‌రావు, పరమేశ్వరి ఆమె భర్త కృష్ణమూర్తి, టీడీపీ యువజన విభాగానికి చెందిన పలువురు నాయకులు వైఎస్‌ జగన్‌మొహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకులు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి, వెంకటగిరి పట్టణ కన్వీనర్‌ జి.ఢిల్లీబాబు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం చేనేత విభాగం అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఇక వెంకటగిరిలో టీడీపీ అవిర్భావం నుంచి కీలకనేతలుగా ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణ ప్రముఖులు రెండు మూడు రోజుల్లో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు సమాచారం. వారి ఆగమనం వైఎస్సార్‌సీపీకి అనుకూలించే అంశం అని రాజకీయాలపై అవగాహన ఉన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top