సినీ నిర్మాతకు రిమాండ్
గుండెపోటు రావడంతో చికిత్సకోసం ఆసుపత్రికి తరలింపు
కాకినాడ లీగల్: చెక్బౌన్స్ కేసులో ‘సినిమా చూపిస్తా మావా’ సినీ నిర్మాత బోగాది అంజిరెడ్డిని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోర్టు సోమవారం రిమాండ్కు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన మేడపాటి సాయికృష్ణా రెడ్డి వద్ద నుంచి 2016లో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన ‘సినిమా చూపిస్తా మావా’ సినీ నిర్మాత బోగాది అంజిరెడ్డి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. దీని నిమిత్తం రూ.5 లక్షలు చెక్కును సాయికృష్ణారెడ్డికి ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కాకినాడ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు.
జూన్ నెల 27వ తేదీన కేసు వాయిదాకు సినీ నిర్మాత హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో కాకినాడ టూటౌన్ పోలీసులు హైదరాబాద్లో ఉన్న అంజిరెడ్డిని అరెస్టు చేసి శనివారం రాత్రి 8 గంటలకు మేజిస్ట్రేట్ వెంకటేశ్వరరావు ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో అస్వస్థతకు గురైన అంజిరెడ్డికి పూర్తి స్థాయిలో చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఐదో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి విచారణ చేసి 14 రోజులు రిమాండ్ విధించగా రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు.