
రుణాలు మాఫీ చేసే వరకు నిలదీస్తాం
‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అన్న సామెతను అక్షరాలా నిజం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఒంగోలు క్రైం: ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అన్న సామెతను అక్షరాలా నిజం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమయంలో తనకు అపార అనుభవం ఉందని, ఎన్నికల హామీలను ఏ విధంగా నెరవేర్చాలో తనకు తెలుసని ఎన్నికల సంఘానికి చెప్పిన చంద్రబాబు, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాలు మాఫీ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అధికార టీడీపీని నిలదీస్తూనే ఉంటుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు లెక్కలేనివిగా ఉన్నాయన్నారు.
రైతుల రుణాలన్నీ మాఫీ చేసి..కొత్త రుణాలిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చిన సంగతి టీడీపీ నేతలు మరిచినట్లున్నారన్నారు. రైతులు సాగుకు ఉద్యుక్తులైన సమయంలో రుణాలు మాఫీ చేయకుండా..కొత్త రుణాలు ఇవ్వకుండా ఉంటే ఎలా? ఈ పరిస్థితి ఎన్నికల సమయంలో గుర్తు రాలేదా అని టీడీపీ నేతలను రఘువీరారెడ్డి ప్రశ్నించారు. కొత్త రుణాల సంగతి దేవుడెరుగు..పాత రుణాలు కట్టాలని బ్యాంకర్లు బెదిరింపులకు దిగుతున్నారని..కనీసం వాటినైనా టీడీపీ నేతలు ఆపలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్థికంగా చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలకు పునరుజ్జీవం కల్పిస్తామని చెప్పినా ఇప్పుడేమో సంఘానికి లక్ష వరకు మాత్రమే రుణమాఫీ అనడం సిగ్గుచేటన్నారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెట్టడం టీడీపీ ప్రభుత్వ దివాళా కోరుతనమేనని ఎండగట్టారు. చేనేత కార్మికుల రుణాలతోపాటు పవర్లూంలకు చెందిన రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని..ఇప్పటి వరకు అసలు వీటి ఊసే లేద న్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకు ఉమ్మడిగా ప్రయోజనం చేకూరేలా రాజ్యాంగంలో పొందు పరిచి ఉందని, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇష్టానుసారం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూడడం దారుణమన్నారు. తొలుత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా.ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టినా అది ప్రకాశం జిల్లా నుంచే మొదలు పెట్టాలని రఘువీరారెడ్డిని కోరారు. అదే విధంగా పీసీసీ కార్యాలయం కూడా ఒంగోలులోనే నిర్మించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రఘువీరారెడ్డితో కలిసి కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కారుమంచి రమాదేవి, పీసీసీ కార్యదర్శి ఈదా సుధాకర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు వై.శశికాంత్ భూషణ్, వేమా శ్రీనివాసరావు, డా.జి.రాజ్విమల్, కె.కనకారావు మాదిగ, మెండు నిషాంత్, ఆర్.వెంకటరావు, కె.జ్వాలారావు, ఎం.కృష్ణారావు, వై.రాజశేఖర్ తదితరులున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ
ఒంగోలు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు డా.ఉగ్రనరసింహారెడ్డితో కలిసి డీసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్కు చేరుకుని తిరిగి రైతు, డ్వాక్రా, చేనేతల రుణమాఫీలు చేయనందుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.