
వైఎస్ జగన్ ఇంత భారీ మెజారిటీతో గెలిచినా సినీ పెద్దలకి కనబడలేదని పృథ్వి ధ్వజమెత్తారు.
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో 'కోడెల టాక్స్'తో వ్యాపారులంతా నష్టాలపాలయ్యారని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పృథ్వి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నరసరావుపేట కోటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 30 ఏళ్ళపాటు వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ను 25 ఏళ్ళు పరిపాలిస్తారని జోస్యం చెప్పారు.
వైఎస్ జగన్ ఇంత భారీ మెజారిటీతో గెలిచినా సినీ పెద్దలకి కనబడలేదని ధ్వజమెత్తారు. సినిమా వాళ్ళని ఎప్పుడూ నమ్మవద్దని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 32 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.